ఈ నెల 27 వరకు భారీ వర్షాలే!
ABN , Publish Date - May 24 , 2025 | 03:26 AM
రాబోయే రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్, మే23(ఆంధ్రజ్యోతి): రాబోయే రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈనెల 27 నాటికి పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మరోపక్క, తెలంగాణలో ఈనెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్ జిల్లా నర్నూర్లో అత్యధికంగా 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 9.1 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో 8.8, జగిత్యాలలో 8.7, ములుగు జిల్లా కన్నాయిగూడేంలో 8.3, జగిత్యాల రూరల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్లోంచి..