Floods: బిరబిరా కృష్ణమ్మ!
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:24 AM
కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. జూన్లోనే బేసిన్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం నీటి నిల్వ వంద టీఎంసీలు దాటింది.. ఆల్మట్టి నుంచి జూరాల దాకా ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి.
ఆల్మట్టి నుంచి జూరాల దాకా తెరుచుకున్న ప్రాజెక్టుల గేట్లు
శ్రీశైలంలో 104 టీఎంసీలకు చేరిన నీరు
ఆల్మట్టి-70 వేలు, నారాయణపూర్-68 వేలు, జూరాలకు
52 వేల క్యూసెక్కుల వరద.. నేడు, రేపు భారీ వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. జూన్లోనే బేసిన్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం నీటి నిల్వ వంద టీఎంసీలు దాటింది.. ఆల్మట్టి నుంచి జూరాల దాకా ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ కృష్ణాలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు బుధవారం 70 వేల క్యూసెక్కుల వరద రాగా.. గేట్ల ద్వారా 27 వేలు, జలవిద్యుత్తు ఉత్పాదనతో 42 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 68 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. గేట్ల ద్వారా 59 వేలు, విద్యుదుత్పాదనకు 6 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఇక భీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కులు రాగా.. 59 వేల క్యూసెక్కులు గేట్ల ద్వారా, 1,600 క్యూసెక్కులను విద్యుదుత్పాదనకు వదిలేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు 52 వేల క్యూసెక్కుల వరద రాగా.. గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 55 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఇటు తుంగ-భ ద్ర నదులపై ఉన్న తుంగభద్ర జలాశయానికి 24 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 105.79 టీఎంసీలకు ప్రస్తుతం 50.31 టీఎంసీలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 58 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 103.89 టీఎంసీల నిల్వ ఉంది. ఈ సీజన్లో ప్రాజెక్టుకు 66.84 టీఎంసీల జలాలు వచ్చి చేరడం విశేషం.. మరోవైపు గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు వరద స్వల్పంగా వస్తోంది. మహారాష్ట్ర ఔరంగాబాద్ శివారులోని పైటన్లో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 12 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తర్వాత సింగూరుకు 540 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్కు 2,315 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లికి 646 క్యూసెక్కుల వరద వచ్చింది.
నేడు, రేపు భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అదే ప్రాంతంలో రాగల 24 గంటల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఆసిఫాబాద్లో అత్యధికంగా 6.1సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కురిసింది. వానల్లేక సాగుపై ఆందోళన చెందుతున్న జిల్లా రైతులకు ఊరటనిచ్చింది. పత్తి, మొక్కజొన్న, కంది, వరితో పాటు పలు కూరగాయల పంటలకు ఈ వర్షం ఊపిరి పోసింది. వేంసూరులో 5.5 సెం.మీ., సత్తుపల్లి మండలం సదాశివపేటలో 3.4 సెం.మీ. వాన పడింది.
పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభం
చింతలపాలెం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు ఎడమ వైపున ఉన్న తెలంగాణ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు(175 అడుగులు) కాగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు 24.0030 టీఎంసీలుగా(48.35 అడుగులు) నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి అవసరాల నిమిత్తం పులిచింతల పవర్హౌస్ ఒక యూనిట్ నుంచి రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. పులిచింతల విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యం 120 మెగావాట్లు కాగా ఒక యూనిట్ నుంచి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని ఎస్ఈ దేశ్యానాయక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు
For National News And Telugu News