Harish Rao: ఉపాధి పని దినాలు తగ్గించడం సరికాదు
ABN , Publish Date - May 04 , 2025 | 04:47 AM
ఉపాధి హామీ పథకం కోసం గత ఏడాదిలో 12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా ఈసారి కేవలం 6.5 కోట్లకే పరిమితం చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
రైతు బీమాను నిర్వీర్యం చేయడం దుర్మార్గం: హరీశ్
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కోసం గత ఏడాదిలో 12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా ఈసారి కేవలం 6.5 కోట్లకే పరిమితం చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని శనివారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. కేంద్రం వెంటనే పనిదినాలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా, కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఫ్రిబ్రవరిలో కట్టాల్సిన రూ.775 కోట్ల ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతు కుటుంబాలకు శాపంగా మారిందన్నారు.