Harish Rao: కాంగ్రెస్ వైఫల్యంతోనే భూగర్భ జలాల్లో తగ్గుదల
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:54 AM
భూగర్భ జల సంరక్షణలో తెలంగాణను ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వ నీటి ప్రణాళికలు.. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురయ్యాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
ప్రభుత్వం నీటి పరిరక్షణ చర్యలు చేపట్టాలి : హరీశ్రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జల సంరక్షణలో తెలంగాణను ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వ నీటి ప్రణాళికలు.. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురయ్యాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో భూగర్భ జలాలు రాష్ట్రంలో 56 శాతం పెరిగాయని, మిషన్కాకతీయ ద్వారా 27 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణతో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అంది 8.93 లక్షల టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
14 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రెండు మీటర్లకుపైగా భూగర్భ జలాలు పడిపోయాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి పరిరక్షణ చర్యలు చేపట్టకుంటే వచ్చే నెలల్లో రాష్ట్రం నీటి కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన హెచ్చరించారు.