Ration Cards: రేషన్ కార్డుల దరఖాస్తులు బంద్
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:22 AM
ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం బంద్ చేసింది.

శనివారం అర్జీల కోసం జనం పడిగాపులు
హైదరాబాద్/సిటీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం బంద్ చేసింది. కొత్త రేషన్ కార్డులతోపాటు ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జత చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే సాయంత్రం నుంచి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 4 గంట ల నుంచి మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో చూసిన ప్రజలు శుక్రవారం సాయంత్రం నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు.
ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తుండటంతో అనేక కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు నమోదు ప్రక్రియ కొనసాగింది. అయితే అకస్మాత్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శుక్రవారం అర్ధరాత్రి మీసేవ నుంచి వెబ్ లింక్ ను తొలగించారు. ఒకేసారి అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సర్వర్పై భారం పడి ఉండొచ్చని, శనివారం నుంచి వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని ప్రజలు భావించారు. అయితే శనివారం దరఖాస్తుల ప్రక్రియ పునరుద్ధరణ కాలేదు. శాసనసమండలి ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లో ఉన్నందున ఈ ప్రక్రియను నిలిపివేశారంటూ వార్త లు వెలువడ్డాయి. అయితే దీనిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖండించింది. రేషన్ కార్డుల దరఖాస్తుల గురించి పౌరసరఫరాల శాఖ గానీ, మీసేవ గానీ తమను సంప్రదించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు దరఖాస్తుల కోసం శనివారం రోజంతా ప్రజలు మీ సేవ కేంద్రాల వద్ద నిరీక్షించారు.