ED raids: శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:03 AM
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్పమెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
సోదరుడు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు
మనీలాండరింగ్ కోణంలో విచారణ
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్పమెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ సోదరుడు, బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. అక్రమాస్తుల కేసులో గత ఏడాది శివబాలకృష్ణ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు బాలకృష్ణ తదితరులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. బాలకృష్ణ ఆస్తులు వందల కోట్ల విలువ ఉండటంతో మనీలాండరింగ్ కోణంలో ఈడీ రంగంలో దిగి పలు కీలక ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. బాలకృష్ణ గతంలో హైదరాబాద్ మెట్రో రైల్, రెరాలో సైతం కీలక బాధ్యతలు నిర్వహించారు.
భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో కొందరు రియల్టర్లతో శివబాలకృష్ణ కుమ్మక్కు అయినట్లు స్పష్టమైన ఆధారాలను ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. శివబాలకృష్ణ కేసులో భాగంగా హైదరాబాద్లోని కొన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ సోదాలు జరపవచ్చని సమాచారం. గత ఏడాది జనవరి 24వ తేదీన ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ, అతని సోదరుడు శివ నవీన్కుమార్ ఇళ్లతో పాటు 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ, అతని బినామీల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూమి, 29 ప్లాట్లు, 7 ఫ్లాట్లు, మూడు విల్లాలు, పుప్పాల్గూడలోని ఆదిత్య ఫోర్ట్ వ్యూలో ఒక లగ్జరీ విల్లా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు.