కస్తూర్బా బాలికల పాఠశాలల్లో దేశ్పాండే ఫౌండేషన్ సేవలు
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:10 AM
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఆంగ్లంలో శిక్షణ ఇవ్వడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు కోసం పని చేస్తున్న దేశ్పాండే ఫౌండేషన్ రాష్ట్రంలో తన సేవలను అందించనుంది.
సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన ప్రతినిధులు
పాలమూరు మహిళా డిగ్రీ కాలేజీ దత్తతకు అంగీకారం
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఆంగ్లంలో శిక్షణ ఇవ్వడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు కోసం పని చేస్తున్న దేశ్పాండే ఫౌండేషన్ రాష్ట్రంలో తన సేవలను అందించనుంది. అమెరికా కేంద్రంగా భారత్లోని పలు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తమ కార్యక్రమాల విస్తరణకు సహకారం అందించాలని సీఎంను కోరారు.
తెలంగాణలోని కస్తూర్బా బాలికల పాఠశాల్లో సేవలు అందించాలని, మహబూబ్నగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి సూచించగా.. వారు వెంటనే అంగీకరించారు. కస్తూర్బా బాలికల పాఠశాలల్లోని విద్యార్థినులకు నైపుణ్యాలతో పాటు ఇంగ్లి్షలో ప్రావీణ్యం సాధించేందుకు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు గురురాజ్ దేశ్పాండే, జయశ్రీ దేశ్ పాండే పేర్కొన్నారు. ఈ భేటీలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.