Damodara Rajanarasimha: జాతిని మోసం చేసెటోడిని కాను
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:02 AM
మాదిగల సమష్టి కృషి, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతం, సీఎం రేవంత్రెడ్డి నిబద్ధత వల్లే రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.

ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవు: దామోదర
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మాదిగల సమష్టి కృషి, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతం, సీఎం రేవంత్రెడ్డి నిబద్ధత వల్లే రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. బట్టేబాజ్ మాటలు చెప్పి జాతిని మోసం చేసెటోడిని కానని, ఎవరికీ భయపడే తత్వం తనది కాదని అన్నారు. ఎస్సీల వర్గీకరణ కల నెరవేరుతోన్న సందర్భంగా మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు మంత్రుల క్వార్టర్లలో రాజనర్సింహను కలిసి సన్మానించారు.
వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. వర్గీకరణ జరగడం ఇష్టం లేని కొందరు వ్యక్తులు, వర్గీకరణ పేరిట మనుగడ సాగించాలనుకునేవారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన మాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి వర్గీకరణను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. భవిష్యత్తులో వర్గీకరణకు ఎలాంటి కోర్టు కేసులు, లీగల్ సమస్యలు ఎదురుకాకుండా కమిషన్ నివేదిక ప్రకారం ముందుకు వెళతామని ఆయన తెలిపారు.