కారును ఢీకొన్న బస్సు.. భార్యాభర్తల మృతి
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:17 AM
కారును బస్సు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా..
కుమార్తె పరిస్థితి విషమం.. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు
రేణిగుంట, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కారును బస్సు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరం పటాన్చెరువుకు చెందిన సందీప్(35) కారును అద్దెకు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
కడప ప్రధాన రహదారిలోని కుక్కలదొడ్డి అటవీ ప్రాంతం వద్ద ఎదురుగా వస్తున్న జమ్మూకశ్మీర్కు చెందిన టూరిస్టు బస్సు వీరి కారును ఢీకొంది. సందీప్, అతడి భార్య అంజలి(32) అక్కడికక్కడే మృతి చెందారు. వీరి కుమార్తెలు లిఖితశ్రీ, సోనాలిసా, కుమారుడు రౌద్ర తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో లిఖితశ్రీ(12) పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.