Panchayat Elections: హస్తం హవా
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:06 AM
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తొలి విడతలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ..
రెండో విడతలోనూ కాంగ్రెస్కు సగానికిపైగా సీట్లు
బీఆర్ఎస్కు 25 శాతానికి పైగా సీట్లు
సిద్దిపేటలో టాప్ గేరులో ‘కారు’
మూడు మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే
మలి విడతలోనూ పుంజుకోని బీజేపీ
కేవలం 6 శాతం స్థానాలతోనే సరి..
రెండో విడతలో 415 స్థానాలు ఏకగ్రీవం
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తొలి విడతలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ.. మలి విడతలోనూ అదే జోరు కొనసాగించింది. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. మలి విడతలో 192 మండలాల పరిధిలోని 3911 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 2200కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మెజారిటీ సీట్లను సాధించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ తన పట్టును నిలుపుకున్నట్లయింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా మలి విడత ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయి. 1100కు (25 శాతానికి) పైగా సీట్లను గెలుచుకోవడం ద్వారా గ్రామాల్లో తన ఉనికిని చాటుకుంది. మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి తొలి విడతతో పోలిస్తే స్వల్పంగా సీట్లు పెరిగాయి. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ పది శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకున్నాయి. మలి విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 415 స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాగా, రెండో విడతలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబల్సే ఉండడం గమనార్హం.
ఊళ్లలో కాంగ్రెస్ కళకళ
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ దశ మారిపోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో డీలా పడిన సంగతి తెలిసిందే. గెలిచిన అభ్యర్థులు కూడా రాత్రికి రాత్రే బీఆర్ఎస్ కండువాలు కప్పేసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో క్షేత్రస్థాయిలో హస్తం పార్టీ పరిస్థితి మారిపోయింది. తొలి, మలి విడత సర్పంచ్ ఎన్నికల్లో సగానికిపైగా సీట్లలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలిచారు. మలి విడతలో మొత్తం 4332 సర్పంచ్ సీట్లకు గాను కడపటి వార్తలు అందేసరికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 2331స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు జిల్లాల వారీగానూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. స్థానిక ఎన్నికలను సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. దీంతో సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. మహబూబ్నగర్, సంగారెడ్డి సహా 20 జిల్లాల్లోనైతే సగానికంటే ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఏకగ్రీవమైన 415 పంచాయతీల్లో 90 శాతానికిపైగా కాంగ్రె్సవే కావడం విశేషం. మలి విడత ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది.
బీఆర్ఎ్సకు కాస్త ఊరట..
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ వెనకంజలోనే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో 25 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకోవడం ఊరట కలిగించే అంశమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి, రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో 25 శాతానికి పైగా సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ తన ఉనికిని చాటుకుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది బీఆర్ఎ్సకు పెద్ద ఊరటేనని విశ్లేషకులు చెబుతున్నారు. మలి విడతలో కడపటి వార్తలు అందేసరికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 1195 సీట్లు గెలుచుకున్నారు. మలి విడతలోనూ కేసీఆర్, హరీశ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ జిల్లాలో మలి విడతలో 186 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా వందకు పైగా సీట్లలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. ఇతరులు 36, కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లలో విజయం సాధించాయి. హరీశ్ నియోజకవర్గంలోని 91 పంచాయతీల్లో 78 బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమైంది. జనగామ జిల్లాలో కాంగ్రెస్ 30 సర్పంచ్ సీట్లు గెలుచుకుంటే.. బీఆర్ఎస్ 37 సీట్లు సొంతం చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్కు 24, బీఆర్ఎ్సకు 40 సీట్లు వచ్చాయి.
మలి విడతలోనూ పుంజుకోని బీజేపీ
రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తు న్న బీజేపీ.. మలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ తన బలాన్ని చూపలేకపోయింది. కడపటి వార్తలు అందేసరికి ఆ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 250కి పైగా సీట్లలో గెలిచారు. బీజేపీ గెలుచుకున్న సీట్లలో సింహభాగం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిఽ ద్యం వహిస్తున్న నియోజకవర్గాలవే కావడం గమనార్హం. అంటే మలివిడత ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో బీజేపీ వాటా కేవలం ఆరు శాతం.
