కాంగ్రె్సలో పదవుల భర్తీపై కసరత్తు!
ABN , Publish Date - Mar 07 , 2025 | 03:59 AM
పదవుల భర్తీపై కాంగ్రె్సలో భారీగా కసరత్తు జరుగుతోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్లు గురువారం గాంధీ భవన్లో భేటీ అయ్యారు.

32 మంది నేతలతో ఏఐసీసీ కార్యదర్శుల ముఖాముఖి
హైదరాబాద్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పదవుల భర్తీపై కాంగ్రె్సలో భారీగా కసరత్తు జరుగుతోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్లు గురువారం గాంధీ భవన్లో భేటీ అయ్యారు. ముఖాముఖిగా సమావేశమై వారి సమర్థతపై ఆరా తీశారు. ఎన్నాళ్ల నుంచీ పార్టీలో ఉన్నారు? పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తారా? ఫలానా బాధ్యత ఇస్తే సమర్థంగా నిర్వహించగలమని అనుకుంటున్నారా? ఇంతవరకు పార్టీ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? తదితర ప్రశ్నలను వేసి సమాధానాలు రాసుకున్నారు.
రాష్ట్ర వ్యప్తంగా ఎంపిక చేసిన 32 మందిని పిలిపించుకుని మరీ ఇంటర్వ్యూలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, వంశీకృష్ణ, ఎడ్మ బొజ్జు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, పార్టీ నేతలు సరితా తిరుపతయ్య, రేఖానాయక్ తదితరులు ఉన్నారు. టీపీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇప్పటికే వీరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.