Ponnam Prabhakar: గురుకుల ప్రవేశాలు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:55 AM
గురుకుల పాఠశాలల్లో విద్యార్ధుల ప్రవేశాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
ఒక్క సీటూ ఖాళీగా ఉండకూడదు: మంత్రి పొన్నం
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : గురుకుల పాఠశాలల్లో విద్యార్ధుల ప్రవేశాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేయడానికి చొరవ తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం ఆయన బీసీ సంక్షేమం, రవాణా శాఖల అధికారులతో సమావేశమై కార్యకలాపాలను సమీక్షించారు. గురుకుల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు తక్షణం అందించాలన్నారు.
విద్యాప్రమాణాలు పెంచడానికి అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా చేపట్టాలని మంత్రి పొన్నం సూచించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 186.5కోట్ల మంది మహిళలు రూ.6,222 కోట్లవిలువైన ఉచిత ప్రయాణాన్ని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మహా లక్ష్మి పథకంను విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను అభినందించారు.