Congress: పథకాలపై ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:24 AM
ఎస్సీ వర్గీకరణ, పేదలకు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ భారతి వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.

జూన్ 2 వరకు విస్తృతంగా కార్యక్రమాలు
నేడు దిశానిర్దేశం చేయనున్న రేవంత్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ వర్గీకరణ, పేదలకు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ భారతి వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ కీలకమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపైన ఉంచనుంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి వంటి కార్యక్రమాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ అంశాలతో పాటు ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణపై పార్టీ ప్రజాప్రతినిధులకు ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 2 వరకు ఈ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపైనా చర్చించనున్నట్లు వెల్లడించాయి.