సింగపూర్, దావోస్కు రేవంత్
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:01 AM
తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్, దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

6 రోజుల విదేశీ పర్యటనకు సీఎం బృందం.. సింగపూర్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పరిశీలన
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్, దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడ మూడు రోజుల పర్యటన అనంతరం దావోస్ వెళ్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట ఉంటారు. శుక్ర, శని, ఆదివారాల్లో సీఎం, మంత్రి, అధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను సందర్శిస్తారు. నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్లో రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియాను అభివృద్థి చేసిన తీరును పరిశీలిస్తారు. సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి, బృంద సభ్యులు ఈ నెల 20న ఉదయం దావోస్ చేరుకుంటారు. 20 నుంచి 22 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొంటారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈసారి అంతకు మించి పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్షలో వెల్లడించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, తయారీ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతోపాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ)పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. గత ఏడాది దావోస్ పర్యటనతోపాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి.