Share News

CM Revanth Reddy: మొబైల్‌ అంగన్‌వాడీలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:39 AM

మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: మొబైల్‌ అంగన్‌వాడీలు

  • మురికివాడలు, వలస కార్మికులుండే ప్రాంతాల్లో ఏర్పాటు

  • అక్కడి పిల్లలకు నిర్దేశిత సమయంలో పౌష్టికాహారం

  • తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికే రోల్‌మోడల్‌ కావాలి

  • పౌష్టికాహారం, బోధనలో అగ్రగామిలా ఉండేలా కార్యాచరణ

  • భవనాల నిర్మాణంలో అధునాతన సాంకేతికత వినియోగం

  • పిల్లలు పట్టించుకోని వృద్ధులకు అండగా నిలవాలి

  • వారి వేతనాల నుంచి తల్లిదండ్రులకు వాటా జమ చేయాలి

  • రవాణాతోపాటు ఇతర శాఖల్లోనూ ట్రాన్స్‌జెండర్ల సేవలు

  • దివ్యాంగులకు మరింత అండగా రాష్ట్ర ప్రభుత్వం

  • సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయంలో అక్కడి పిల్లలకు ఆయా వాహనాల ద్వారా పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపితే.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలన్నారు. అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఐదేళ్ల వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యనందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని నిర్దేశించారు. సోమవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖలపై ముఖ్యమంత్రి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలకు నూతన భవనాల నిర్మాణం అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని, పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్‌ చేయించే అంశాన్ని అధ్యయనం చేయించాలని సూచించారు. సోలార్‌ ప్లేట్లు, బ్యాటరీ బ్యాక్‌పతో కంటైనర్‌ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం, ఎక్కువ సౌకర్యం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న కంటైనర్‌ కేంద్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.


పౌష్టికాహారం అందజేతలో ఎన్జీవోల సేవలు

అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రతి చిన్నారికీ పౌష్టికాహారం అందించాలని, ఇందుకు ఎన్జీవోల సేవలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. బాలామృతం ప్లస్‌ను పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. కర్ణాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నారని, పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టి సారించాలని అన్నారు. తెలంగాణ ఫుడ్స్‌, విజయా డెయిరీ ఉత్పత్తులను అంగన్‌వాడీలకు అందేలా చూడాలన్నారు. అంగన్‌వాడీల పర్యవేక్షణ, నిర్వహణ, పౌష్టికాహారం అందజేతపై వంద రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు కలిసే పని చేయాలన్నారు. ఇక అనాథ పిల్లలకు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారని, అదే సమయంలో ఏటీసీల్లోనూ వాళ్లకు ప్రవేశాలు కల్పించాలని నిర్దేశించారు.


మన పిల్లలను సింగపూర్‌లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్నామని, అక్కడికి పంపే వారిలో అనాథ పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఉద్యోగాలు చేస్తున్న పలువురు.. తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అలాంటి వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారితల్లిదండ్రులకు ఖాతాలకు 10-15 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ అంశంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ రైజింగ్‌-2047 డాక్యుమెంట్‌లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. దివ్యాంగుల వివాహాలు, వివిథ పథకాల్లో వారికి ప్రోత్సాహకాలు కల్పించే విషయంపై వచ్చే క్యాబినెట్‌ సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్‌ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను ఇతర శాఖ ల్లోనూ వినియోగించుకునేలా చూడాలన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 04:39 AM