చెరసాల ఇంధనం!
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:34 AM
హైదరాబాద్లోని చంచల్గూడ జైలు పెట్రోల్ బంకు అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఇండియన్ అయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బంకు పెట్రో అమ్మకాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని బంకుల్లో నంబర్వన్గా నిలిచింది.
పెట్రో అమ్మకాలలో చంచల్గూడ జైలు బంకు రికార్డు
ఏడాదిలో రూ.75కోట్ల వ్యాపారం.. రూ.2.5 కోట్ల లాభం
వరుసగా 12వ సారి హెసెల్స్ పురస్కారం
సైదాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని చంచల్గూడ జైలు పెట్రోల్ బంకు అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఇండియన్ అయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బంకు పెట్రో అమ్మకాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని బంకుల్లో నంబర్వన్గా నిలిచింది. ఈ మేరకు వరుసగా 12వ ఏడాది చంచల్గూడ బంకుకు హైసెల్స్ అవార్డు వరించింది. శిక్షపడ్డ ఖైదీలు, జైల్లోంచి విడుదలైన వారితో నిర్వహిస్తున్న ఈ బంకులో ఇంధన అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024- 25)గాను రూ.75 కోట్ల వ్యాపారం జరిగింది. 69లక్షల లీటర్ల పెట్రోలు అమ్మకాలు నిర్వహించి, సుమారు రూ.2.5కోట్ల లాభం గడించింది. తెలంగాణ జైళ్ల శాఖ, ఐవోసీ ఆధ్వర్యంలో 2013 జూన్ 5న చంచల్గూడ జైలు సమీపంలో సుధార్ పేరుతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు.
ఈ బంకు నిర్వహణలో శిక్షపడ్డ ఖైదీలను భాగస్వాములను చేశారు. ఈ పెట్రోల్ బంకు 12 ఏళ్ల కాలంలో ఖర్చులు పోనూ సుమారు రూ.30 కోట్లకు పైగా లాభాలు గడించింది. సంవత్సరానికి రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల వ్యాపారం సాగుతోంది. 2017 జూన్ 23న జైలు సమీపంలోనే మహిళా జైలు ఆధ్వర్యంలో మరో పెట్రోల్ బంకు ఏర్పాటు చేశారు. కొన్ని నెలలకు ఈ రెండు పెట్రోల్ బంకులు అమ్మకాలలో పోటీ పడ్డాయి. 2024లో చంచల్గూడ జైలు పెట్రోల్ బంకును మరింతగా విస్తరించారు. తెలంగాణ జైళ్ల ఆధ్వర్యంలో చర్లపల్లి, చంచల్గూడ, కర్మన్ఘాట్ ఎల్బీనగర్, ఫలక్నుమా పెట్రోల్ బంకులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బంకులు నిర్వహిస్తున్నారు. మొత్తం జైళ్ల ఆధ్వర్యంలోని 30 పెట్రోల్ బంకుల్లో సంవత్సరానికి సుమారు రూ.1,000 కోట్లకు పైగా వ్యాపారాలు సాగుతుండగా ఎక్కువ శాతం అమ్మకాలు చంచల్గూడ జైలు పెట్రోల్ బంకులోనే సాగుతున్నాయి. పూర్తిగా జైళ్లశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటంతో నాణ్యతకు నాణ్యత, కచ్చితమైన కొలతలు ఉంటాయనే నమ్మకంతో వాహనదారులు బంకుకు బారులు తీరుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు.
ఖైదీలకు, విడుదలైన వారికి ఉపాధి
జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, విడుదలైన వారికి ఈ పెట్రోల్ బంకులో ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 జైళ్ల పెట్రోల్ బంకుల్లో 400 మంది పని చేస్తున్నారు. జైలు మ్యాన్యువల్ ప్రకారం ఖైదీలకు రోజుకు రూ.150, మిగతా వారికి నెలకు రూ.15 వేల నుంచి 18 వేల వేతనం చెల్లిస్తున్నారు. కాగా, వరుసగా చంచల్గూడ జైలు పెట్రోల్ బంకు కు అవార్డులు రావడం గర్వంగా ఉందని జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..