వరంగల్ భద్రకాళి బోనాలు వాయిదా
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:31 AM
ఓరుగల్లు భద్రకాళి దేవస్థానంలో బోనాల నిర్వహణ వాయిదాపడింది. గ్రామదేవతలకు నిర్వహించే బోనాలను నిత్యం హోమం, పూజలు జరిగే ఆలయంలో నిర్వహించడం ఆగమశాస్త్ర విరుద్ధం అని వేదపండితులు, అర్చకుల్లో కొందరి నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆలయంలో బోనాలు శాస్త్ర విరుద్ధమన్న పండితులు
ఫలితంగా కొత్త సంప్రదాయంపై మంత్రి సురేఖ వెనక్కి
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఓరుగల్లు భద్రకాళి దేవస్థానంలో బోనాల నిర్వహణ వాయిదాపడింది. గ్రామదేవతలకు నిర్వహించే బోనాలను నిత్యం హోమం, పూజలు జరిగే ఆలయంలో నిర్వహించడం ఆగమశాస్త్ర విరుద్ధం అని వేదపండితులు, అర్చకుల్లో కొందరి నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. లేని కొత్త ఆనవాయితీని తెరపైకి తేవవడం సరైంది కాదని భక్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల్లోనూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో దక్షిణాచార శాక్తా ద్వైతవైదిక స్మార్థ ఆగమ సిద్ధాంతం ప్రకారం పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.
అలాంటిది గ్రామ దేవతల మాదిరిగా బోనాలు నిర్వహించడం సరైంది కాదని పండితులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భద్రకాళి అమ్మవారికి 22న బంగారు బోనం సమర్పించనున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గారు.