Ponguleti: 14న భూభారతి పోర్టల్ ప్రారంభం
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:28 AM
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘భూ భారతి’ చట్టం అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14) రోజున అమల్లోకి రానుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి వెల్లడించారు.

శిల్పారామంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో
పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
మణుగూరు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘భూ భారతి’ చట్టం అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14) రోజున అమల్లోకి రానుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన వెబ్ పోర్టల్ను ఏప్రిల్ 14న శిల్పారామంలో సాయంత్రం 5గంటలకు సీఎం రేవంత్ ప్రారంభిస్తారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివా్సరెడ్డి శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల మాట్లాడారు. భూ భారతి బిల్లుకు గత డిసెంబరులో అసెంబ్లీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నదానిపై విధివిధానాలను రూపొందించామన్నారు.
చట్టంలోని నిబంధనలను భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం రోజున సీఎం రేవంత్ వివరిస్తారని పేర్కొన్నారు. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో గిరిజన, గిరిజనేతర ప్రజలకు సంబంధించిన భూముల విషయాలపై పలు అంశాలను తెలియజేయనున్నట్లు ఆయన చెప్పారు. గతం ప్రభుత్వం 2020లో ధరణి చట్టాన్ని తెచ్చిందని, కానీ 2023 వరకు కూడా ఆ చట్టం అమలుకు విధివిధానాలను ఖరారు చేయలేకపోయిందని పొంగులేటి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిన మూడు నెలల్లోనే నిబంధనలను రూపొందించిందని చెప్పారు. పేదలు కష్టపడి సంపాదించిన భూమికి భద్రత కల్పించడమే భూభారతి చట్టం ఉద్దేశమన్నారు. కాగా, కూనవరం గ్రామంలో గిరిజనులు వంకా శివలక్ష్మి, కాంతారావు దంపతుల ఇంట్లో పొంగలేటి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చేశారు. ఆ దంపతుల మధ్య మంత్రి నేలపై కూర్చొని భోజనం చేయడమే కాకుండా వారికి వడ్డించారు. తర్వాత వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here