బీటీపీఎస్ పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలి..
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:46 AM
భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (బీటీపీఎ్స)లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయించాలంటూ జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
జెన్కో అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (బీటీపీఎ్స)లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయించాలంటూ జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఎలక్ట్రిక్, సివిల్, మెకానికల్ పనులను అగ్రిమెంట్ ప్రకారం నిర్ధిష్ట గడువులో బీహెచ్ఈఎల్ కంపెనీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం ప్రజాభవన్లో బీటీపీఎస్ అభివృద్ధి పనులపై జెన్కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బీటీపీఎస్ యూనిట్ 1 ఉత్పత్తికి సంబంధించి కాలిపోయిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల గురించి ఆరా తీశారు. మరమ్మతులు చేయడానికి టెండర్ పిలిచామని, పనులు పురోగతిలో ఉన్నాయని చీఫ్ ఇంజనీర్ పీవీ శ్రీనివాస్ వివరించారు.
జెన్కో పరిధిలోని విద్యుత్తు కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో ఉత్పత్తి నిలిచిపోతే వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవడానికి డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్ అధికారులతో త్రిసభ్య కమిటీ వేయాలని భట్టి ఆదేశించారు. సింగరేణి మైనింగ్ ప్లాంట్ మణుగూరు నుంచి బీటీపీఎస్ వరకు రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. బీటీపీఎ్సలో ఏ చిన్న సంఘటన జరిగినా చీఫ్ ఇంజనీరే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఐటీడీఏ పీడీ ద్వారా స్థానిక గిరిజనులను పవర్ ప్లాంటులో నాన్ టెక్నికల్ కార్మికులుగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్కు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామని చెప్పారు. ప్రజాభవన్లో తనను కలిసిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నేతలకు ఈమేరకు భరోసానిచ్చారు. అలాగే జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలలో పదోన్నతులకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులిస్తామన్నారు.