Bhatti Vikramarka: పన్నేతర రెవెన్యూపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:13 AM
పన్నేతర రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియ్సగా దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్ కమిటీ చైౖర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): పన్నేతర రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియ్సగా దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్ కమిటీ చైౖర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. పన్నేతర రెవెన్యూతో పాటుగా కేంద్ర నిధులను కూడా సాధించుకోవాలని సూచించారు. ఆదివారం సచివాలయంలో జరిగిన అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉప సంఘం భేటీలో మంత్రులు, కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా నిలిపివేయకుండా కొత్తగా రూ.33,600 కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
అధికారంలోకి వచ్చిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఔటర్ రింగ్ రోడ్, ఎక్సైజ్ ఆదాయాలు రాకుండా పోయాయని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు సహా పలు కొత్త పథకాలను ప్రజలకు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. బడ్జెట్ నిధులను అన్ని శాఖలకు సమానంగా పంచాలని అధికారులకు సూచించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పెండింగ్లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే పది రోజుల్లో రేషనలైజేషన్ పూర్తి చేసి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.