ఫార్చ్యూనర్ కారులో వచ్చి.. ఏటీఎంలో చోరీ
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:04 AM
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ఓ ఏటీఎం కేంద్రం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.19.66 లక్షలు అపహరించిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
గ్యాస్ కట్టర్తో కట్ చేసి రూ.19.66 లక్షల అపహరణ
షార్ట్ సర్క్యూట్గా నమ్మించేందుకు ఏటీఎంకు నిప్పు
హుజూర్నగర్ , జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ఓ ఏటీఎం కేంద్రం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.19.66 లక్షలు అపహరించిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. లింగగిరి రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి ఆదివారం తెల్లవారుజామున ఫార్చ్యూనర్ కారులో వచ్చిన ఇద్దరు యువకులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే నగదు చోరీకి పాల్పడ్డారు. అనంతరం ఏటీఎంకు నిప్పు పెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ జరిగిందని నమ్మించడం కోసమే ఏటీఎంకు నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఘటనకు ముందురోజే ఏటీఎంలో రూ.20 లక్షల నగదును నింపినట్లు ఏటీఎం ఏజెన్సీ నిర్వాహకుడు గంగాధరమూర్తి పోలీసులకు తెలిపారు.