Payyavula Keshav: బనకచర్లకు బీఆర్ఎస్ రాజకీయ రంగు
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:18 AM
కేటీఆర్, హరీశ్రావు మధ్య రాజకీయ అస్తిత్వ పోరు నడుస్తోంది. ఆ కారణంగానే బనకచర్ల ప్రాజెక్టుకు రాజకీయ రంగు పులుముతున్నారు’ అని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
కేటీఆర్, హరీశ్రావు మధ్య రాజకీయ అస్తిత్వ పోరు
సీమకు నీరిస్తామన్న కేసీఆర్ మాటలు మరిచిపోయారా..?: ఏపీ మంత్రి పయ్యావుల
అనంతపురం, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘కేటీఆర్, హరీశ్రావు మధ్య రాజకీయ అస్తిత్వ పోరు నడుస్తోంది. ఆ కారణంగానే బనకచర్ల ప్రాజెక్టుకు రాజకీయ రంగు పులుముతున్నారు’ అని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు. సముద్రంలోకి వెళ్లే జలాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్, హరీశ్రావు మధ్య ఉన్న అస్తిత్వ పోరుకు రాజకీయ రంగు పులిమి, ఇదేదో ప్రాంతాల మధ్య సమస్య అన్నట్లు మాట్లాడటం బాధాకరం. రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు హరీశ్రావుకు గుర్తుకు రాలేదా? ఆయన తన అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమంలో, సొంత పార్టీలో తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తారు.
కేటీఆర్ ఎక్కడా బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు. హరీశ్రావు ట్రాప్లో పడి, ఆ పార్టీ మిగతా నేతలు బనకచర్లపై మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, దాని మూలంగా తెలంగాణకు నష్టం ఉండదని వారికీ తెలుసు. తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఆ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు కట్టినా సంతోషాన్ని వ్యక్తం చేశాం. మొన్నటి దాకా కలిసున్న వాళ్లమే కదా..! ఇదంతా పొలిటికల్ డ్రామా’ అని పయ్యావుల అన్నారు.