Share News

Drug Raid: ఏపీ డిప్యూటీ తహసీల్దార్‌ డ్రగ్స్‌ దందా

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:05 AM

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి.. కొండాపూర్‌ సర్వీస్‌ అపార్టుమెంట్‌లో డ్రగ్స్‌తో రేవ్‌పార్టీ చేసుకుంటున్న ఆరుగురిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ వింగ్‌- ఈగల్‌, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 20 గ్రాముల కొకైన్‌, 3 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకోగా..

Drug Raid: ఏపీ డిప్యూటీ తహసీల్దార్‌ డ్రగ్స్‌ దందా

  • కొండాపూర్‌లో డ్రగ్స్‌తో నిర్వహిస్తున్న రేవ్‌పార్టీపై ఈగల్‌, గచ్చిబౌలి పోలీసుల దాడి

  • ఆరుగురి అరెస్టు.. ప్రధాన నిందితుడికి డ్రగ్స్‌ అలవాటు చేసింది డిప్యూటీ తహసీల్దారే

  • అతడిని విచారిస్తే వెలుగులోకి మరిన్ని వివరాలు.. పోలీసుల వెల్లడి

  • 20 గ్రాముల కొకైన్‌, 3 గ్రా. ఎండీఎంఏ సీజ్‌

  • గ్లుటాక్స్‌ ఇంజక్షన్‌ల మాటున డ్రగ్స్‌ సరఫరా మల్నాడు డ్రగ్స్‌ కేసుతో నిందితులకు లింకు

రాయదుర్గం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి.. కొండాపూర్‌ సర్వీస్‌ అపార్టుమెంట్‌లో డ్రగ్స్‌తో రేవ్‌పార్టీ చేసుకుంటున్న ఆరుగురిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ వింగ్‌- ఈగల్‌, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 20 గ్రాముల కొకైన్‌, 3 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకోగా.. రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసే మణిదీప్‌ డ్రగ్స్‌ దందా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. కొండాపూర్‌లోని ఓ సర్వీస్‌ అపార్టుమెంట్‌లో డ్రగ్స్‌తో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నట్లు ఉప్పందుకున్న ఈగల్‌, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. తేజ, విక్రమ్‌, మన్నె నీలిమ, చందన్‌, పురుషోత్తమ్‌రెడ్డి, భార్గవ్‌ అనే నిందితులను అరెస్టు చేశారు. వీరికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. తేజ డ్రగ్స్‌ సప్లయర్‌గా పనిచేస్తున్నట్లు.. బెంగళూరుకు చెందిన రాహుల్‌ అనే డ్రగ్స్‌ పెడ్లర్‌ పరారీలో ఉన్నట్లు డీసీపీ వివరించారు. తేజకు రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసే మణిదీప్‌ డ్రగ్స్‌ అలవాటు చేసినట్లు తెలిపారు. ‘‘మణిదీప్‌ 2023 డిసెంబరు 31న గోవాలో పార్టీ నిర్వహించాడు. ఆ పార్టీకి తేజ, నీలిమ వెళ్లారు. అక్కడే వీరు మణిదీప్‌ ద్వారా కొకైన్‌ రుచి మరిగారు. మణిదీప్‌ రాజమండ్రిలోని తన సొంత ఫామ్‌హౌ్‌సలో పలుమార్లు డ్రగ్స్‌ పార్టీలునిర్వహించాడు. ఆ తర్వాత మణిదీప్‌ డ్రగ్స్‌ పార్టీలకు తేజ సప్లయర్‌గా మారాడు. రాహుల్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకునేవాడు. తేజ, నీలిమ, విక్రమ్‌ ముగ్గురూ స్నేహితులు. వీరంతా రాజమండ్రికి చెందినవారు. కొండాపూర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. తరచూ కొకైన్‌ పార్టీలు చేసుకునేవారు’’ అని డీసీపీ వివరించారు. తేజ డ్రగ్స్‌తోపాటు.. బాడీబిల్డింగ్‌ కోసం గ్లుటాహిన్‌ విటమిన్‌ ఇంజక్షన్‌ను వాడుతుంటాడని, దాని మాటున రాహుల్‌ ద్వారా కొరియర్‌లో కొకైన్‌, ఎండీఎంఏ డ్రగ్స్‌ని తెప్పించేవాడని పేర్కొన్నారు. తాజాగా అరెస్టయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు విక్రమ్‌తో ఇటీవల సంచలనం సృష్టించిన మల్నాడు కిచెన్‌ నిందితుడు సూర్యకు స్నేహం ఉన్నట్లు గుర్తించామని డీసీపీ వెల్లడించారు. సూర్య నెట్‌వర్క్‌తో తాజాగా పట్టుబడ్డ ముఠాకు లింకులున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. తాజా కేసుతో డీటీ మణిదీ్‌పకు సంబంధం లేకున్నా.. అతడిని విచారిస్తే డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 04:05 AM