AIG Hospital: ఏఐజీలో న్యూరో క్యాథ్ ల్యాబ్
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:58 AM
పక్షవాత బాధితులకు సత్వర చికిత్స అందించడానికి ఏఐజీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా న్యూరో క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు.
బ్రెయిన్ స్ట్రోక్ నిర్ధారణ, చికిత్స అన్నీ ఒకే చోట
ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి
హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పక్షవాత బాధితులకు సత్వర చికిత్స అందించడానికి ఏఐజీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా న్యూరో క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. దీనివల్ల జబ్బు నిర్ధారణ, చికిత్స అందించడంలో జాప్యం తగ్గిపోతుంది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేసిన న్యూరో క్యాథ్ ల్యాబ్ను ముఖ్యమంత్రి కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కేవలం స్ట్రోక్ బాధితుల కోసమే న్యూరో క్యాథ్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు.
రోగికి ఒక చోట సిటీ స్కాన్, మరో చోట వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మరో చోట చికిత్స ఇలా కాకుండా ఈ న్యూరో క్యాథ్ల్యాబ్తో అన్నీ ఒకే చోట నిర్వహించి అక్కడిక్కడే అవసరమైన వైద్యం అందించే అవకాశముందని వివరించారు. ప్రత్యేకమైన న్యూరో ఐసీయూ, స్ట్రోక్ నిపుణుల నిరంతర పర్యవేక్షణ వల్ల న్యూరోవాస్కులర్ ఎమర్జెన్సీల నిర్వహణలో ఇది గొప్ప ముందడుగని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఏటా దాదాపు 18 లక్షల స్ట్రోక్ కేసులు నమోదు అవుతున్నట్లు వైద్యులు వివరించారు.