Share News

Adilabad: గుండెపోటుతో సివిల్‌ కాంట్రాక్టర్‌ మృతి

ABN , Publish Date - May 10 , 2025 | 05:33 AM

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ గుట్ట ప్రవీణ్‌ (46) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బిల్లుల కోసం గురువారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లిన ప్రవీణ్‌ పనులు ముగించుకుని ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Adilabad: గుండెపోటుతో సివిల్‌ కాంట్రాక్టర్‌ మృతి

  • రూ.50 కోట్ల పెండింగ్‌ బిల్లుల కోసం ఏడాదిగా తిరుగుతున్న ప్రవీణ్‌ !

ఆదిలాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ గుట్ట ప్రవీణ్‌ (46) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బిల్లుల కోసం గురువారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లిన ప్రవీణ్‌ పనులు ముగించుకుని ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో ప్రవీణ్‌ ఛాతీలో నొప్పి రావడంతో అతనితో ఉన్న వ్యక్తులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ప్రవీణ్‌ అప్పటికే మరణించారని నిర్ధారించారు.


ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్యేలు పాయల శంకర్‌, అనిల్‌ జాదవ్‌, మాజీ మంత్రి జోగు రామన్న తదితరలు ప్రవీణ్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కాగా, ప్రవీణ్‌కు చెందిన తిరుమల కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు రూ.50కోట్ల బిల్లులు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ బిల్లుల కోసం ప్రవీణ్‌ ఇటీవల తరచూ హైదరాబాద్‌ వెళ్లి వస్తున్నారు. పెండింగ్‌ బిల్లుల విషయంలో ప్రవీణ్‌ ఇటీవల తీవ్ర మనస్తాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు, బంధువులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారు.

Updated Date - May 10 , 2025 | 05:33 AM