Share News

Adi Srinivas: బీసీ బిల్లు బీజేపీ వల్ల అవుతుందా.. లేదా?

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:58 AM

విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆమోదించిన బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడం బీజేపీ వల్ల అవుతుందో..

Adi Srinivas: బీసీ బిల్లు బీజేపీ వల్ల అవుతుందా.. లేదా?

  • రఘునందన్‌ ఆ పాఠాలేవో వారి పార్టీకే చెప్పుకోవాలి: ఆది శ్రీనివాస్‌

  • బీజేపీ.. అగ్రవర్ణ పార్టీ: కవ్వంపల్లి.. దళితులకు బీఆర్‌ఎస్‌ ద్రోహం: అద్దంకి

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆమోదించిన బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడం బీజేపీ వల్ల అవుతుందో.. కాదో.. చెప్పాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నిలదీశారు. బీజేపీ వల్ల కాకపోతే రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక ఆమోదించుకుంటామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కాంగ్రె్‌సకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, ఆవేవో ఆయన పార్టీకే చెప్పుకోవాలన్నారు. బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లు అమలు కావడం రఘునందన్‌రావుకు ఇష్టం లేదని మండిపడ్డారు. బీసీ బిల్లులకు ఆమోదం తెలపకుండా బీజేపీ నేతలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్‌ అని.. సీఎం రేవంత్‌రెడ్డి బీసీ బిడ్డ కాకున్నా బీసీ బిల్లులు తీసుకువచ్చారని కొనియాడారు. బీజేపీ.. అగ్రవర్ణ పార్టీ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.


స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి.. బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదని విరుచుకుపడ్డారు. గాంధీభవన్‌లో ‘అందుబాటులో ప్రజా ప్రతినిధులు’ కార్యక్రమంలో భాగంగా కవ్వంపల్లి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో బూతులను ప్రవేశ పెట్టిందే కేసీఆర్‌ అని, కేటీఆర్‌ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులకు ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీఆర్‌ఎస్సేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. దళితుల గురించి కేటీఆర్‌ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. దళితులపై బీఆర్‌ఎస్‌ నేతలు దాడులు, విధ్వంసాలు ఇంకా ఎవరూ మర్చిపోలేదన్నారు. పాత పథకాల పేరుతో రైతులు, దళితులను కేటీఆర్‌ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. కౌశిక్‌రెడ్డి బతుకు కుక్కలు చింపిన విస్తరి కావడం ఖాయమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ధ్వజమెత్తారు. పిచ్చిలేసినట్లు ఏది పడితే అది మాట్లాడితే.. ప్రజలు రాళ్లతో కొట్టి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరుస్తారన్నారు. చిన్నబాసు డ్రామారావు చేసిన పనులన్నీ కౌశిక్‌రెడ్డికి గుర్తుకు వస్తున్నట్టున్నాయని, అందుకే అవే విషయాలను కలవరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్‌ ఎక్కడ మళ్లీ బీఆర్‌ఎ్‌సలోకి వస్తాడోనన్న భయంతో కల్వకుంట్ల కుటుంబం వద్ద పేరు తెచ్చుకునేందుకు తెగ తాపత్రయపడుతన్నారని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

For Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:58 AM