Share News

Hyderabad Scam: అధిక వడ్డీ ఆశ చూపి..150 కోట్లకు టోపీ

ABN , Publish Date - May 31 , 2025 | 03:43 AM

లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. 16 నెలల్లో రెండింతలు ఇస్తామని ఆశ చూపారు. డిపాజిట్లు చెల్లించినవారికి బాండ్‌ పేపర్లు రాసిచ్చారు. కొందరికి అధికంగా డబ్బులిచ్చి నమ్మించారు.

Hyderabad Scam: అధిక వడ్డీ ఆశ చూపి..150 కోట్లకు టోపీ

  • 16 నెలల్లో సొమ్ము డబుల్‌ అంటూ 1,530 మంది నుంచి డిపాజిట్లు వసూలు

  • తిరిగి చెల్లించని పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌

  • జీడిమెట్ల పోలీస్‌‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు

  • నిర్వాహకుల్లో ఒకరి అరెస్టు.. పరారీలో మరొకరు

జీడిమెట్ల, మే 30 (ఆంధ్రజ్యోతి): లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. 16 నెలల్లో రెండింతలు ఇస్తామని ఆశ చూపారు. డిపాజిట్లు చెల్లించినవారికి బాండ్‌ పేపర్లు రాసిచ్చారు. కొందరికి అధికంగా డబ్బులిచ్చి నమ్మించారు. సుమారు 1,530 మంది నుంచి రూ.150 కోట్లకుపైగా వసూలు చేశారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. హైదరాబాద్‌ శివార్లలోని జీడిమెట్లలో ఈ భారీ మోసం వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన వడైగర్‌ బాలాజీ (35), తండ్లే చౌదరి స్వాతి(30) 2023లో చింతల్‌ సూర్యానగర్‌లోని రిడ్జ్‌ టవర్స్‌లో పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌ పేరిట సంస్థను నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఎల్‌బీ నగర్‌, అత్తాపూర్‌లలోనూ కార్యాలయాలు పెట్టారు. రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే 16 నెలల్లో రూ.2 లక్షలు ఇస్తామని ఆశ చూపారు.


దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలవారు అధిక వడ్డీ ఆశతో డబ్బులు డిపాజిట్‌ చేశారు. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు కట్టారు. వారిలో కొందరికి సంస్థ నిర్వాహకులు అధిక వడ్డీ చెల్లించారు. ఇది చూసి కొందరు తమ బంధువులను, స్నేహితులను ఈ సంస్ధలో చేర్పించి, డబ్బులు కట్టించారు. 16 నెలల గడువు పూర్తయినవారు రెండు నెలలుగా డబ్బుల కోసం కార్యాలయానికి వస్తున్నారు. నిర్వాహకులు ఏదో ఓ కారణం చెబుతూ వారిని కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. 30న(శుక్రవారం) డబ్బులు ఇస్తామని కొందరికి చెప్పడంతో.. సుమారు 100 మంది వరకు వచ్చారు. కానీ కార్యాలయం మూసివేయడంతో మోసపోయామని గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహకురాలు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ పరారీలో ఉన్నాడు.


ఇవి కూడా చదవండి

ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Updated Date - May 31 , 2025 | 03:43 AM