Ind vs SA: అరుదైన రికార్డుపై సఫారీల కన్ను
ABN , Publish Date - Nov 24 , 2025 | 08:44 PM
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో సఫారీ సేన గెలిస్తే.. ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయలేక తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు సమర్పించుకున్న భారత్.. బ్యాటింగ్లోనూ తేలిపోయింది. 201 పరుగులకే ఆలౌటై ఓటమి దిశగా పయనిస్తోంది. ఇంకా రెండ్రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో భారత్ గెలవాలంటే అద్భుతమే జరగాలి. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిస్తే ప్రపంచంలో ఏ జట్టూ సాధించని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. గువాహటి టెస్టులో గెలిస్తే సుదీర్ఘ ఫార్మాట్లో భారత్ను స్వదేశంలో రెండు సార్లు వైట్వాష్ చేసిన పర్యాటక జట్టుగా సౌతాఫ్రికా రికార్డుల్లోకి ఎక్కుతుంది.
టీమిండియా ఇప్పటి వరకు స్వదేశంలో రెండు సార్లు మాత్రమే వైట్వాష్కు గురైంది. 2000 సంవత్సరంలో హాన్సీ క్రోంజే నేతృత్వంలోని సౌతాఫ్రికా టీమ్ 2-0తో టీమిండియా(Team India)ను ఓడించింది. గతేడాది టామ్ లేథమ్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ 3-0తో టీమిండియాను వైట్ వాష్ చేసింది. బీసీసీఐ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1980లో ముంబై వేదికగా ఇంగ్లండ్తో భారత్ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు పది వికెట్ల తేడాతో గెలిచింది. కానీ సాంకేతికంగా ఒకే మ్యాచ్ ఆడటంతో దీన్ని సిరీస్గా పరిగణించలేదు. గువాహటి టెస్టులో భారత్ ఓడితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంటాడు. స్వదేశంలో విదేశీ జట్టు చేతిలో రెండు వైట్ వాష్లు ఎదుర్కొన్న తొలి హెడ్ కోచ్గా నిలుస్తాడు. 2024లో కివీస్ చేతిలో టీమిండియా వైట్ వాష్కు గురైనప్పుడు కూడా గంభీర్ కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్
టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!