Share News

Asia Cup 2025: భారత్‌ను ఆపతరమా

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:06 AM

ఊహించినట్టుగానే మరోసారి ఆసియా క్‌పలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ తలపడబోతున్నాయి. షేక్‌ హ్యాండ్‌ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే ఇరు జట్ల మధ్య ఆదివారం సూపర్‌-4....

Asia Cup 2025: భారత్‌ను ఆపతరమా

నేడు పాకిస్థాన్‌తో పోరు

రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

  • బరిలోకి బుమ్రా

  • ఒత్తిడిలో దాయాది

  • ఆసియా కప్‌ సూపర్‌-4

దుబాయ్‌: ఊహించినట్టుగానే మరోసారి ఆసియా క్‌పలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ తలపడబోతున్నాయి. షేక్‌ హ్యాండ్‌ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే ఇరు జట్ల మధ్య ఆదివారం సూపర్‌-4 మ్యాచ్‌ జరుగనుంది. దీంతో మైదానంలో ఈసారి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. కానీ గ్రూప్‌ మ్యాచ్‌ తరహాలోనే కచ్చితంగా భారత ఆటగాళ్లు ప్రత్యర్థికి కరచాలనం ఇవ్వకపోవచ్చు. ఇక.. టోర్నీలో అజేయంగా ఉన్న భారత్‌ ఎప్పటిలాగే ఆధిపత్యం చూపాలనుకుంటోంది. అయితే ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో మన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. బుమ్రా, వరుణ్‌ల విశ్రాంతి కారణంగా జట్టులోకి వచ్చి పేసర్లు అర్ష్‌దీప్‌, హర్షిత్‌లను ఒమన్‌ బ్యాటర్లు సులువుగా ఎదుర్కొన్నారు. దీంతో పాక్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌కు స్టార్‌ పేసర్‌ బుమ్రాతో పాటు స్పిన్నర్‌ వరుణ్‌ను రంగంలోకి దించనున్నారు. దుబాయ్‌ పిచ్‌ స్పిన్నర్లకు

అనుకూలం కావడంతో కుల్దీప్‌, వరుణ్‌, అక్షర్‌ కీలకం కానున్నారు. అయితే ఒమన్‌తో మ్యాచ్‌లో గాయపడిన అక్షర్‌ ఫిట్‌నె్‌సపై స్పష్టత లేదు. అతను ఆడలేని పక్షంలో సుందర్‌కు చాన్స్‌ దక్కవచ్చు. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ గిల్‌, హార్దిక్‌, దూబే పుంజుకోవాల్సి ఉంది. శాంసన్‌ హాఫ్‌ సెంచరీతో ఫామ్‌ చాటుకున్నా అతడి ఆటలో దూకుడు కనిపించలేదు. వన్‌డౌన్‌లో కెప్టెన్‌ సూర్య తిరిగి ఆడనున్నాడు.


తుది జట్లు (అంచనా):

భారత్‌: అభిషేక్‌, గిల్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శాంసన్‌, దూబే, హార్దిక్‌, అక్షర్‌/సుందర్‌, వరుణ్‌, కుల్దీప్‌, బుమ్రా.

పాక్‌: ఫర్హాన్‌, సయీమ్‌, హరీస్‌, ఫఖర్‌ జమాన్‌, సల్మాన్‌ ఆఘా (కెప్టెన్‌), హసన్‌ నవాజ్‌, మహ్మద్‌ నవాజ్‌, ఖుష్దిల్‌ షా, షహీన్‌ అఫ్రీది, హరీస్‌ రౌఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌.

గెలుపే ధ్యేయంగా..

అనిశ్చితి ఆటతీరుకు మారుపేరుగా నిలిచే పాకిస్థాన్‌ జట్టు తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగనుంది. భారత్‌తో చివరి మ్యాచ్‌లో ఘోర పరాభవంతో పాటు కరచాలనం రూపంలో ఎదురైన అవమానం కూడా వారిలో కసిని రేపే అవకాశం ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల సల్మాన్‌ ఆఘా సారథ్యంలోని పాక్‌ జట్టులో కనిపిస్తోంది. అటు అంచనా పెట్టుకున్న బ్యాటర్లు భారత స్పిన్‌ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. ఓపెనర్‌ సయీమ్‌ అయూబ్‌ హ్యాట్రిక్‌ డకౌట్లతో కొనసాగుతుండగా, అతను బౌలర్‌గా ఆరు వికెట్లు తీయడం సానుకూలాంశం. పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ను బరిలోకి దించవచ్చు. బ్యాటింగ్‌లో చెలరేగుతున్న పేసర్‌ హషీన్‌ అఫ్రీది పవర్‌ప్లేలో ప్రభావం చూపితే భారత్‌కు ఇబ్బంది తప్పదు.


తలుపులు మూసేసి.. ఫోన్లు ఆఫ్‌ చేసి..

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కోసం తమ జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతుందని కెప్టెన్‌ సూర్యకుమార్‌ స్పష్టం చేశాడు. దాయాదితో రెండోసారి తలపడేందుకు ఎలా సిద్ధమవుతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘తలుపులను మూసివేసి.. మొబైల్స్‌ను ఆఫ్‌ చేసి ప్రశాంతంగా నిద్రపోవాలని మా ఆటగాళ్లకు చెబుతాను. బయటి నుంచి మంచి సలహాలను స్వీకరిస్తే సరిపోతుంది’ అని తెలిపాడు. అయితే ప్రెస్‌ మీట్‌లో సూర్యకుమార్‌ ఒక్కసారి కూడా పాక్‌ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. స్టేడియం నిండిన సందర్భంలో ప్రేక్షకులకు వినోదం అందించేందుకు అదే సరైన సమయంగా భావిస్తానని సూర్య చెప్పాడు. మరోవైపు పాక్‌తో తొలి మ్యాచ్‌లో వివాదానికి గురైన రెఫరీ ఆండీ పైక్రా్‌ఫ్టనే ఈసారి కూడా నియమించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 06:06 AM