Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ, KSCAపై కేసు
ABN , Publish Date - Jun 05 , 2025 | 09:00 PM
Bengaluru Stampede: డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే.. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు కర్ణాటక క్రికెట్ బోర్డు, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలోనే జరిగాయి.
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం దగ్గర చోటుచేసుకున్న విషాద ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. నేరపూరిత హత్యలకు సంబంధించిన సెక్షన్ 105 కింద కూడా కేసు నమోదు అయింది. ఇక, ఈ కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID)కు అప్పగించాలా లేదా అన్నదానిపై కేబినేట్ చర్చలు జరుపుతోంది.
కేబినేట్ ఓకే అనుకుంటే కేసు సీఐడీ చేతికి వెళుతుంది. ఈ కేసుపై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జీ జగదీశ మాట్లాడుతూ.. ‘నేను ఈ రోజు నుంచే ఈ కేసుపై పని చేయటం మొదలెట్టాను. 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాను. ఈ కేసుకు సంబంధించి ఆర్సీబీకి కానీ, కర్ణాటక క్రికెట్ బోర్డుకు కానీ, మేము ఎలాంటి విజ్ణప్తులు చేయలేదు. వాళ్లే ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. బెంగళూరు టీమ్ కావటంతో ప్రభుత్వం కూడా టీమ్ ప్లేయర్లను సన్మానించాలని అనుకుంది’ అని అన్నారు.
ఇక, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే.. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు కర్ణాటక క్రికెట్ బోర్డు, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలోనే జరిగాయి. విజయోత్సవ వేడుకల్ని సరైన విధంగా ఆర్గనైజ్ చేయకపోవటం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు కర్ణాటక క్రికెట్ బోర్డు నిన్న ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని గురువారం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
మరీ ఇంత దారుణమా.. అమ్మాయిలపై మగాళ్ల గుంపు దాడి..
చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..