Insurance Fraud: ఇన్సూరెన్స్ డబ్బు కోసం రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.. ఇదేం తెలివి బ్రో..
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:41 PM
తైవాన్కు చెందిన ఓ యువకుడు ఇన్సూరెన్స్ పరిహారం కోసం భారీ మోసానికి ప్లాన్ చేసి చివరకు రెండు కాళ్లనూ పోగొట్టుకున్నాడు. అతడికి డబ్బు రాకపోగా జైలు శిక్ష కూడా పడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐదు ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకేసారి మోసం చేద్దామనుకున్న ఓ వ్యక్తి దారుణంగా దెబ్బతిన్నాడు. అతడి ప్లాన్ వికటించి రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. డబ్బు చేతికి రాకపోగా చివరకు జైలుపాలయ్యాడు. తైవాన్లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది (Taiwan insurance scam).
2023లో తైపీలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు నిందితుడు జాంగ్ తన స్నేహితుడు లియావ్తో కలిసి ఈ ఇన్సూరెన్స్ ఫ్రాడ్కు తెర తీశాడు. అప్పట్లో జాంగ్ ఐదు బీమా కంపెనీల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు లైఫ్ యాక్సిడెంట్, దీర్ఘకాలిక కేర్, ట్రావెల్ ఇన్సూరెన్స్లను తీసుకున్నాడు. ఆ తరువాత లియావ్ సలహా మేరకు ఇన్సూరెన్స్ డబ్బును సొంతం చేసుకునేందుకు భారీ స్కెచ్ను అమలు చేశాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడినట్టు నటించి డబ్బులు దండుకోవాలనేది లియావ్ వ్యూహం. ఇందుకు అనుగుణంగా స్నేహితులిద్దరూ తమ అపార్ట్మెంట్కు బకెట్లో డ్రై ఐస్ను (గడ్డ కట్టిన కార్బన్డయాక్సైడ్) తెచ్చారు.
మైనస్ 78.5 డిగ్రీల అతి శీతల ఉష్ణోగ్రత ఉండే డ్రై ఐస్తో తనని తాను గాయపరచుకుని యాక్సిడెంట్ అయినట్టు చూపించాలనుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలు మొదలు మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ డ్రై ఐస్లో కాళ్ల పెట్టి ఉండిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. జాంగ్ మధ్యలో లేచి వెళ్లిపోకుండా ఉండేందుకు లియావ్ అతడిని కుర్చీకి గట్టిగా కట్టేసి కూర్చోపెట్టాడు. శీతల ఉష్ణోగ్రత కారణంగా జాంగ్ పాదలు మొత్తం డ్యామేజ్ అయ్యాయి. లోపలి కండరాలు, ఎముకలు కూడా కుళ్లిపోయాయి. చివరకు వైద్యులు అతడి రెండు కాళ్లను పిక్కల వరకూ తొలగించాల్సి వచ్చింది.
అయితే, మోటర్ సైకిల్ తోలుతుండగా జరిగిన ప్రమాదంలో ఈ పరిస్థితి దాపురించిందనంటూ జాంగ్ ఇన్సూరెన్స్ డబ్బుకు క్లెయిమ్ చేసుకున్నాడు. రూ.12 కోట్ల పైచిలుకు మొత్తాన్ని పరిహారం కింద కోరాడు. ఫ్రాస్ట్ బైట్ (శీతల ఉష్ణోగ్రత వల్ల గాయాలు కావడం) కారణంగా రెండు కాళ్లు పోయాయని చెప్పుకున్నాడు. ఈ క్రమంలో ఒక కంపెనీ అతడికి స్వల్ప మొత్తాన్ని ఇచ్చింది.
ఇతర కంపెనీలు మాత్రం అతడి వివరణపై అనుమానం వ్యక్తం చేశాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో, జాంగ్, లియావ్ పథకం బట్టబయలైంది. ఈ కేసులో ఇటీవలే కోర్టు నిందితులిద్దరికీ జైలు శిక్ష విధించింది. ఈ ప్లాన్కు రూపకల్పన చేసిన లియావ్కు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. జాంగ్కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. శాశ్వత వైకల్యం దాపురించింది.
ఇవి కూడా చదవండి:
ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..
రన్నింగ్లో విమానం ఎక్కుదామనుకున్నావా.. అదేమైనా రైలా.. ఎవురయ్యా నువ్వు..