Actress Priya Marathe Passes Away: బుల్లితెరలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:07 PM
పవిత్ర రిస్త, సాత్ నిభానా సాథియా సీరియళ్లు తెలుగులో డబ్ అయ్యాయి. తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియ సీరియల్స్లోనే కాకుండా పలు షోలలో కూడా కనిపించారు.
ముంబై: టీవీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి ప్రియ మరాఠే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ముంబై, మీరా రోడ్లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ప్రియ వయసు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే. కొన్ని నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, చికిత్స తీసుకుంటున్నా క్యాన్సర్ నుంచి కోలుకోలేకపోయారు. ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ప్రియ ప్రాణాలు విడిచారు.
డబ్బింగ్ సీరియల్స్తో తెలుగులోనూ..
ప్రియ మరాఠే హిందీ, మరాఠీ భాషల్లో పలు సీరియళ్లు చేశారు. చార్ దివస్ సాసూచే, కసమ్ సే, పవిత్ర రిస్త, ఉత్తరన్, తు తీతేమే, భాగేరే మన్, సాత్ నిభానా సాథియా, స్వారాజ్యకాంక్ష్ శంభాజీతోపాటు మరికొన్ని సీరియల్స్లో నటించారు. వీటిలో పవిత్ర రిస్త, సాత్ నిభానా సాథియా సీరియళ్లు తెలుగులో డబ్ అయ్యాయి. తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియ సీరియల్స్లోనే కాకుండా పలు షోలలో కూడా కనిపించారు. చివరగా ‘తూజెచ్మీ గీత్ ఘాత్ ఆహే’ షో కనిపించారు. ఆ షో 2024 జూన్ నెలలో ముగిసింది.
సోషల్ మీడియాకు దూరంగా..
ప్రియ ప్రముఖ నటుడు శంతను మోఘేను 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ప్రియ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టీవ్గా ఉండేవారు. తరచుగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేవారు. అయితే, క్యాన్సర్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాకు దూరం అయ్యారు. చివరిసారిగా 2024, ఆగస్టు 11వ తేదీన చివరి పోస్ట్ పెట్టారు. ఏడాది తర్వాత సరిగ్గా అదే నెలలో 2025, ఆగస్టు 31వ తేదీన కన్నుమూశారు. ప్రియ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ తమ బాధను, సంతాపాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చెవులను కాటన్ ఇయర్బడ్స్తో క్లీన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయంలో జాగ్రత్త..!
రేపట్నించి మంచినీళ్లు కూడా ముట్టను.. మనోజ్ జారంగే హెచ్చరిక