ట్రాఫిక్ చలాన్... ఏక్ నజర్
ABN , Publish Date - Jun 01 , 2025 | 10:04 AM
ఒకరు రోడ్డు మీద టూవీలర్పై సిగ్నల్ను కూడా పట్టించుకోకుండా అతి వేగంగా దూసుకుపోతారు. మరొకరు హెల్మెట్ ధరించకుండానే టూవీలర్తో రోడ్డెక్కుతారు. ఇంకొకరు ఫోర్ వీలర్లో వెళ్తూ సీటు బెల్ట్ ధరించరు. హైవే మీద ట్రక్ డ్రైవరేమో అత్యధిక లోడుతో ప్రమాదభరితంగా నడుపు తుంటాడు. ఇలాంటి సన్నివేశాలు ప్రతీచోటా నిత్యకృత్యమే. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జరిమానాలు వేసినా వాహనదారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఈమధ్య ఒక కార్ ప్లాట్ఫామ్ సంస్థ వెల్లడించిన ట్రాఫిక్ చలాన్ వివరాలివి...
మన దేశంలో గత ఏడాది (2024) ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినవారికి పోలీసులు వేసిన జరిమానా విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 12 వేల కోట్ల రూపాయలు. ఇందులో 9 వేల కోట్ల రూపాయలను ఇంకా వసూలు చేయాల్సి ఉంది.
కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 4 లక్షల 61 వేల రోడ్డు ప్రమాదాలు జరిగితే, 2023లో 4 శాతం పెరిగాయి. రహదారి మరణాలు కూడా 2 శాతం పెరిగాయి.
హర్యానాలోని ఒక ట్రక్ యజమాని 18 టన్నులు అధిక బరువుతో వాహనాన్ని నడిపినందుకు ఆయనకు 2 లక్షల 5 వేల జరిమానా వేశారు. బెంగళూరులోని ఒక టూ వీలర్ ప్రయాణి కుడు ఏకంగా 475 సార్లు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించాడు. ఆయనకు వివిధ సందర్భాల్లో పోలీసులు వేసిన జరి మానా ఎంతనుకున్నారు? రూ. 2 లక్షల 91 వేలు.
2024లో మొత్తం జారీ చేసిన చలాన్లు 8 కోట్లు.
అంటే ప్రతీ సెకనుకు ఒక చలాన్ పడుతోందన్నమాట.
అత్యధికంగా చలాన్లు వేటికి వేస్తున్నారంటే... మొదటిది అతివేగం, రెండోది హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడమని రిపోర్టు వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ ఉన్నాయి.
గురుగావ్లో ప్రతీ రోజూ ట్రాఫిక్ పోలీసులు 4,500 చలాన్లు రాస్తున్నారు. ఒకరోజుకు 10 లక్షల రూపాయలు జరిమానా కింద ఆయా వాహనదారుల నుంచి వసూలు చేస్తున్నారు. నోయిడాలో హెల్మెట్ ధరించలేదన్న కారణంతో ఒక్క నెలలోనే 3 లక్షల చలాన్లు ఇష్యూ చేశారు.

ఇప్పటిదాకా వేసిన చలాన్లలో 75 శాతం జరిమానాలు ఇంకా వసూలు కావాల్సి ఉంది.
ట్రాఫిక్ నిబంధనలను చాలామంది పట్టించుకోరు కానీ, జరిమానా విధించాలంటే చాలానే ఉంటాయి. లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రంకన్ డ్రైవ్ వంటివే కాకుండా... వెహికల్కు హారన్ లేకున్నా, ఇండికేటర్ వేయకున్నా, చీకటి పడ్డాక లైట్ వేయకున్నా, అత్యధిక శబ్దం చేసే హారన్ పెట్టుకున్నా, కారు డాష్బోర్డులో టీవీ, సినిమా చూస్తూ డ్రైవ్ చేస్తున్నా... సైడ్ మిర్రర్లు లేకున్నా, వాహనంపై అనవసరపు స్టిక్కర్లు అంటించినా జరిమానా విధించే అధికారం ఉంటుంది.
మనదేశంలో ట్రాఫిక్ నిబంధనలను సరిగా పాటించక పోవడం వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...
Read Latest Telangana News and National News