Woman Regret Divorce: తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్
ABN , Publish Date - Jul 22 , 2025 | 02:40 PM
తల్లిదండ్రుల తప్పుడు మాటల ప్రభావానికి లోనై భర్తను శాశ్వతంగా దూరం చేసుకున్నందుకు ఓ మహిళ నెట్టింట పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు, తోబుట్టువుల మాటలు విని భర్తను దూరం చేసుకుని తప్పు చేశానంటూ ఓ మహిళ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్గా మారింది. చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకున్నానంటూ ఆమె తన గోడును నెట్టింట వెళ్లబోసుకున్నారు. తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆమె రెడిట్ వేదికగా ఈ పోస్టు పెట్టారు.
తనది ప్రేమ వివాహమని ఆమె తెలిపారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. భర్తతో చిన్న గొడవ చివరకు ఊహించని మలుపులు తిరిగిందని విచారం వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడి మాటలకు ప్రభావితమై భర్తపై వరకట్నం, గృహహింస ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టానని అన్నారు. నాలుగేళ్ల తరువాత ఈ వివాదాన్ని సెటిల్ చేసుకున్నామని చెప్పారు.
ఆ తరువాత తన మాజీ భర్త మరో వివాహం చేసుకున్నాడని అన్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు తనను తల్లిదండ్రులు, సోదరుడి భార్య అవమానకరంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తనకు మద్దతుగా నిలిచిన వారే ఇలా మారడం తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. తన చర్యలకు ప్రస్తుతం పశ్చాత్తాపం చెందుతున్నానని, జీవితంలో విఫలైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
‘తప్పుడు కేసులు పెట్టినందుకు భర్తకు, అతడి కుటుంబానికి వెళ్లి క్షమాపణలు చెబుదామని అనుకున్నా. కానీ చాలా ఆలస్యం జరిగిపోయింది. అతడు మరో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో నేను విఫలమైన వ్యక్తిగా మిగిలిపోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తప్పు చేస్తే పర్యవసానం తప్పదని కామెంట్ చేశారు. మహిళ చేతిలో ఆ భర్త ఎంత నరకం చూసుంటాడో అని మరో వ్యక్తి విచారం వ్యక్తం చేశారు. తాత్కాలిక ఆవేశాలు, వెనక గోతులు తవ్వే బంధువులతో లైఫ్ ఇలాగే ఉంటుందని మరికొందరు అన్నారు. తల్లిదండ్రులే కూతురి జీవితాన్ని ఇంతలా నాశనం చేస్తారని అనుకోలేదని మరికొందరు ఆశ్చర్యపోయారు. భార్యాభర్తలు తమ విషయాల్లో ఎంత దగ్గరవారినైనా జోక్యం చేసుకోనివ్వద్దని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
సింగపూర్ ఎయిర్పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం
ఇలాంటి ఇంటి ఓనర్లు కూడా ఉంటారా.. అద్దెకున్న యువకుడికి ఎలాంటి గిఫ్ట్