Barabanki Bus Accident: మీ దుంపలు తెగ.. మనుషులు చచ్చిపోతుంటే వీడియోలు తీస్తారా?
ABN , Publish Date - Aug 09 , 2025 | 07:28 AM
Barabanki Bus Accident: బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు సాయం చేయసాగారు. అయితే, కొంతమంది మాత్రం తుక్కుతుక్కయిన బస్సులో ఇరుక్కుని అల్లాడిపోతున్న వారిని పట్టించుకోలేదు.
సెల్ ఫోన్ వాడకం మొదలైన తర్వాత మనుషుల ఎమోషన్స్లో కొద్దికొద్దిగా తేడాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. ఎమోషన్స్ బాగా పాడైపోయాయి. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియని పరిస్థితికి కొంతమంది దిగజారిపోయారు. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. బస్సు ప్రమాదానికి గురై మనుషులు చనిపోతుంటే.. వాళ్లను కాపాడాల్సిందిపోయి కొంతమంది వీడియోలు తీస్తూ నిలబడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం ఓ బస్సు హైదర్ఘర్ నుంచి బరబంకి వెళుతోంది. 10.30 గంటల సమయంలో హరఖ్ గ్రామంలోని రాజా బజార్ దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది. ఓ పెద్ద చెట్టు బస్సుపై కుప్పకూలింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొంతమంది టీచర్లు కూడా ఉన్నారు. ఎన్సీఈఆర్టీ ట్రైనింగ్ కోసం బస్సులో వెళుతూ ఉన్నారు.
ఈ సమయంలోనే ప్రమాదం జరిగింది. నలుగురు టీచర్లు చనిపోయారు. బస్సు డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు సాయం చేయసాగారు. అయితే, కొంతమంది మాత్రం తుక్కుతుక్కయిన బస్సులో ఇరుక్కుని అల్లాడిపోతున్న వారిని పట్టించుకోలేదు. ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా వీడియోలు తీస్తూ నిల్చున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. వీడియోలు తీస్తూ నిల్చున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రాఖీ పండుగ శుభాకాంక్షలు