102 ఏళ్లలో తాతయ్య మారథాన్ రికార్డు..
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:20 PM
మైక్ ఫ్రీమాంట్కు ఆరుపదుల వయసులో క్యాన్సర్ నిర్ధారణ అయింది. మూడు నెలలకు మించి బతికే అవకాశం లేదన్నారు. అలాంటి వ్యక్తి ఏకంగా 102 ఏళ్లు బతకడమే గాక... ఇప్పటికీ మారథాన్ లలో రికార్డులు సృష్టిస్తూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఫ్లోరిడాకు చెందిన ఈ శతాధిక తాతగారి ఫిట్నెస్ గురించిన ఆసక్తికర విశేషాలివి...
- ఆహారం కీలకం
60 ఏళ్ల వయసులో మైక్కు క్యాన్సర్ నిర్ధారణ అయింది. మహా అయితే మూడు నెలలకు మించి బతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. మరోవైపు ఆర్థరైటీస్ సమస్యలు కూడా ఉన్నాయని అప్పుడే తేలింది. దాంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ నేపథ్యంలో క్యాన్సర్ని నివారించే ఆహారాల గురించి తెలుసుకున్నాడు. వెంటనే దాన్ని అమలుపరిచి పూర్తిగా ప్లాంట్ బేస్డ్ డైట్కి మారిపోయాడు. అల్పాహారంలో భాగంగా ఓట్మీల్, సిరప్, బ్లూబెర్రీస్.. మధ్యాహ్న భోజనంలో బీన్స్... డిన్నర్లో బ్రకోలి, తాజా పండ్లు మొదలైనవి తీసుకోవడం ప్రారంభించాడు. కట్చేస్తే... రెండున్నరేళ్ల తర్వాత ఆయన శరీరంలో ఎలాంటి క్యాన్సర్ కణాలు లేవని వైద్య పరీక్షలో తేలింది. ఆహార నియమావళి ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అప్పుడే ఆయనకు అర్థమైంది.
- ఒత్తిడి లేకుండా...
‘ఒత్తిడి మనల్ని మరణం అంచులకు తీసుకువెళ్తుంద’ని అంటాడు మైక్. అందుకే తాను ఎలాంటి ఒత్తిడులు దరిచేరనివ్వకుండా ప్రశాంతంగా జీవనాన్ని గడుపుతున్నాడు.
- కసరత్తులు ముఖ్యం
బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మైక్ భార్య అకస్మాత్తుగా మరణించింది. ఆ సమయంలో ఒంటరితనాన్ని, మానసిక వేదనను దూరం చేసుకునేందుకు వ్యాయామం మంచి మార్గమని భావించి.. పరుగెత్తడం, చిన్న చిన్న వ్యాయా మాలు చేయడం ప్రారంభించాడు. ఒకప్పుడు వారానికి మూడుసార్లు 10 మైళ్లు పరుగెత్తేవాడు. వయసురీత్యా ఇప్పుడు 5 మైళ్లకు కుదించాడు. దాంతోపాటు వారానికి మూడుసార్లు కనోయింగ్కు కేటాయిస్తాడు. పుషప్స్, పుల్-అప్స్ రోజూ చేస్తుంటాడు.
- అకాల మరణాలతో..
మైక్ తండ్రి 69 ఏళ్ల వయసులో కాలేయ క్యాన్సర్తో, తల్లి 70 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూయడంతో తన ఆహారం, వ్యాయామాల్లో మార్పులు చేసుకున్నాడు. అదే ఇన్నాళ్లు ఆరోగ్యంగా బతికేందుకు దోహదపడిందని చెబుతున్నాడు.

- దీర్ఘాయువుకి కారణం
వాతావరణ కార్యకర్తగా పనిచేస్తున్న మైక్.. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత భూమిని అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నాడు. ఆ ఆకాంక్షే తను వందేళ్లకు పైగా ఆరోగ్యంగా బతికేందుకు కారణమైందని అంటాడు.
- సత్సంబంధాలు కలిగి ఉండాలి
వారానికి మూడుసార్లు తన స్నేహితులతో కలసి మారథాన్స్లో పాల్గొంటాడు మైక్. అలాగే తరచూ బంధువులు, సన్నిహితులను కలుస్తూ, కాసేపు సరదాగా వారితో కబుర్లు పంచుకుంటాడు. ‘ఈ సత్సంబంధాలే మనిషిని మరింత కాలం భూమిపై జీవించేలా చేస్తాయ’ని అంటాడు మైక్.

ఈ వార్తలు కూడా చదవండి.
నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...
Read Latest Telangana News and National News