TANA: ఒంగోలులో తానా మానవతా సేవా కార్యక్రమం
ABN , Publish Date - Oct 31 , 2025 | 09:53 PM
ప్రకృతి విపత్తు మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయంగా.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మానవతా సేవా కార్యక్రమాన్ని చేపట్టింది.
ఒంగోలు: ప్రకృతి విపత్తు మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మానవతా సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు, కార్యదర్శి రాజా కసుకుర్తి సహకారంతో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని దత్తాత్రేయ, బలరాం కాలనీలలో సుమారు 600 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా తుపాను బాధితులకు వేడి భోజనం, అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ అందజేయడం ద్వారా తానా.. తన సేవా దృక్పథాన్ని మరోసారి ప్రదర్శించింది. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తుల సమయంలో మనసున్న వారు ముందుకు రావడం ద్వారా సమాజం బలాన్ని చూపిస్తుందన్నారు. తానా సహకారంతో ఈ రోజు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అన్నదానం చేయగలిగామని తెలిపారు.

భవిష్యత్తులో సైతం వరదలు, ఇతర విపత్తుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తానా, సూర్యశ్రీ ట్రస్ట్ కలిసి సహాయం చేస్తాయని ఈ సందర్భంగా మండవ మురళీ కృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ షహనాజ్, కార్యదర్శి షేక్ సర్దార్ భాష, గౌరవ సలహాదారుడు మండవ సుబ్బారావు, జనసేవ శ్రీనివాస్, మేడిశెట్టి సుబ్బారావు, కల్లూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. కేవలం విదేశాల్లోనే కాదు, స్వదేశంలో సైతం ప్రతి అవసరమైన వ్యక్తికి సహాయం చేయడమే తమ సేవల లక్ష్యమని ఈ సందర్భంగా తానా ప్రతినిధులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్
గల్ఫ్ నుండి ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ విమానాలు నడపాలి..ఏపీ సీఎంకు ఎన్నారైల విజ్ఞప్తి