Ganesh Naivedyam: వినాయక చవితి విందు
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:53 AM
వినాయకుడు స్వతహాగా భోజన ప్రియుడు. అందుకే ఆ స్వామికి అటుకులు, బెల్లం, శనగలు, ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డు, పులిహోర... ఇలా ఎన్నింటినో నివేదిస్తూ ఉంటాం. వాటితోపాటు...
వినాయకుడు స్వతహాగా భోజన ప్రియుడు. అందుకే ఆ స్వామికి అటుకులు, బెల్లం, శనగలు, ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డు, పులిహోర... ఇలా ఎన్నింటినో నివేదిస్తూ ఉంటాం. వాటితోపాటు వినాయకచవితి రోజున నివేదించే విభిన్న నైవేద్యాల వివరాలు మీకోసం...
ఉండ్రాళ్లు పెసరపప్పు పాయసం
కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు- అర కప్పు, బియ్యంపిండి- ఒక కప్పు, బెల్లం- ఒక కప్పు, నెయ్యి- అయిదు చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, చిక్కని కొబ్బరి పాలు- రెండు కప్పులు, జీడిపప్పులు- పది, బాదం పప్పులు- పది, కిస్మిస్లు- పది

తయారీ విధానం
పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక కప్పు నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. తరవాత ఈ పప్పును మెత్తగా మెదిపి గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఒకటింబావు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. అందులో మూడు చెంచాల బెల్లం, ఒక చెంచా నెయ్యి వేసి కరిగించాలి. తరవాత బియ్యంపిండి వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. పిండి బాగా దగ్గరికి వచ్చాక స్టవ్ మీద నుంచి దించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్లు చేయాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి అందులో బెల్లం, రెండు కప్పుల నీళ్లు వేసి కరిగించాలి. బెల్లం కరిగిన తరవాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా కలపాలి. పెసరపప్పు మొత్తం బెల్లం నీళ్లలో కలిశాక... బియ్యం పిండి ఉండ్రాళ్లు వేసి కలపాలి. వీటిని చిన్న మంట మీద పది నిమిషాలపాటు ఉడికించాలి. ఇవి బెల్లం-పెసరపప్పు మిశ్రమంలో ఉడికి బాగా ఉబ్బి పైపైన తేలుతుంటాయి. వెంటనే స్టవ్ మీద నుంచి దించి అందులో యాలకుల పొడి, కొబ్బరిపాలు వేసి బాగా కలపాలి.
స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి మూడు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీడిపప్పులు, బాదంపప్పులు, కిస్మి్సలు వేసి దోరగా వేయించి... నేతితో సహా ఉండ్రాళ్ల మిశ్రమంలో వేసి కలపాలి. తియ్యని ఉండ్రాళ్లు- పెసరపప్పు పాయసం నైవేద్యానికి రెడీ..!
తుమ్మికూర పచ్చడి కావాల్సిన పదార్థాలు
తుమ్మికూర- ఒక కప్పు, పచ్చి చింతకాయ ముక్కలు- ఒక కప్పు, పచ్చిమిర్చి- తొమ్మిది, ఎండుమిర్చి- రెండు, వేయించిన జీలకర్ర- ఒక చెంచా, వేయించిన మెంతులు- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, నూనె- తగినంత, ఆవాలు- పావు చెంచా, మినపపప్పు- అర చెంచా, కరివేపాకు- కొద్దిగా
తయారీ విధానం
తుమ్మికూరను నీళ్లతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నాలుగు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. అందులో పచ్చి మిర్చి ముక్కలు, చింతకాయ ముక్కలు వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. తరవాత నూనెలో కొద్దిగా ఇంగువ వేసి కలపాలి. వెంటనే తుమ్మికూరను కూడా వేసి బాగా వేపి మరో పళ్లెంలోకి తీయాలి. చిన్న రోలులో వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు, ఉప్పు వేసి మెత్తగా నూరాలి. తరవాత పచ్చిమిర్చి-చింతకాయల మిశ్రమం, వేయించిన తుమ్మికూర వేసి నూరాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీయాలి. స్టవ్ మీద నూనె గిన్నె పెట్టి మరో చెంచా నూనె వేసి వేడిచేయాలి. అందులో పసుపు, ఆవాలు, మినపపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఎర్రగా వేపాలి. ఈ తాలింపును పచ్చడిలో వేసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న తుమ్మికూర పచ్చడిని ఉండ్రాళ్లతోపాటు వినాయకునికి నివేదించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..