Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా చుట్టూ ఆరుగురు గన్మెన్
ABN , Publish Date - May 27 , 2025 | 05:24 AM
హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్లో లాహోర్ అనార్కలీ బజార్లో తుపాకులు పట్టిన ఆరుగురు భద్రతా సిబ్బందితో పర్యటించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్ పర్యటనలో అసాధారణ భద్రత
న్యూఢిల్లీ, మే 26: గూఢచర్యం కేసులో అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(33) పాకిస్థాన్ పర్యటనలో ఉన్నప్పటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాహోర్లోని అనార్కలీ బజార్లో ఆమె పర్యటించినపుడు చుట్టూ ఆరుగురు సాయుధులు భద్రతగా ఉన్నారు. స్కాట్లాండ్ యూట్యూబర్ కాలమ్ మిల్ తీసిన ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. జ్యోతి మల్హోత్రా లాహోర్కు వెళ్లిన సమయంలో మిల్ కూడా అక్కడే ఉన్నాడు. అనార్కలీ బజార్లో జ్యోతి వీడియో తీస్తుండగా.. మిల్ తీసిన వీడియోలో ఆమె కనిపించారు. ఈ సందర్భంగా జ్యోతిని మిల్ పలకరించాడు. తాను భారతీయురాలినని జ్యోతి పరిచయం చేసుకుంది. పాకిస్థాన్కు రావడం ఇదే తొలిసారా? అని జ్యోతి ప్రశ్నించగా.. ఐదు సార్లు వచ్చానని మిల్ చెప్పాడు. పాక్లో ఆతిథ్యం బాగుందా? అని మిల్ అడగగా.. చాలా బాగుందని జ్యోతి చెప్పింది. ఆమె చుట్టూ అందరూ యువకులే తుపాకులు పట్టుకుని భద్రతగా ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘చూడండి.. ఆమె చుట్టూ ఆరుగురు గన్మెన్ ఉన్నారు. ఇంత భారీ భద్రత ఉండటం చూస్తే.. ఈ ప్రాంతం సురక్షితం కాదు’ అని వ్యాఖ్యానించాడు. మిల్ ఈ వీడియోను తన చానల్లో పోస్టు చేశాడు. పాక్ పర్యటనలో జ్యోతికి అసాధారణ భద్రత కల్పించడంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్మెన్ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్కు షాక్
ఆపరేషన్ సిందూర్పై ముందుగానే పాక్కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News