Rahul Gandhi: కూర్పు మనది.. లాభాలు చైనావి.. మేక్ ఇన్ ఇండియాపై రాహుల్ విసుర్లు
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:06 PM
తయారీ రంగంలో నిరుద్యోగిత పెరుగుతోందని, నిజాయితీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక మద్దతు కల్పించడం ద్వారా లక్షలాది మంది ఉత్పత్తిదారులకు సాధికారిత కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలో కేంద్రం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' (Make in India) విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. ఇండియాలో ఐఫోన్లు అసెంబ్లింగ్ చేస్తున్నామే కానీ, తయారు చేయడం లేదని, ఇందువల్ల మనకంటే చైనానే ఎక్కువ లాభాలు ఆర్జిస్తోందని అన్నారు.
తయారీ రంగంలో నిరుద్యోగిత పెరుగుతోందని, నిజాయితీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక మద్దతు కల్పించడం ద్వారా లక్షలాది మంది ఉత్పత్తిదారులకు సాధికారిత కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రముఖ ఐటీ హబ్- ది నెహ్రూ ప్లేస్ మార్కెట్లో శివం, సైఫ్ అనే ఇద్దరు మొబైల్ టెక్నీషియన్లతో తాను సంభాషించిన ఒక వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు.
దిగుమతి చేసుకుంటున్నామే కానీ..
ఇండియాలో విడి భాగాలను దిగుమతి చేసుకుని వాటిని అసెంబ్లింగ్ చేస్తున్నామని, ఇందువల్ల చైనాకే ప్రయోజనం చేకూరుతోందని రాహుల్ తెలిపారు. 'మేక్ ఇన్ ఇండియాతో ఫ్యాక్టరీ రంగం అమాతం పెరుగుతుందని కేంద్రం చెప్పింది. మరి తయారీ రంగం కనిష్టానికి ఎందుకు పడిపోయింది? యువత నిరుద్యోగిత రేటు ఎందుకు భారీగా పెరిగింది? చైనా నుంచి దిగుమతులు రెండు రెట్లు ఎందుకు పెరిగాయి?' అని రాహుల్ వరుస ప్రశ్నలు సంధించారు. నిజం నిక్కచ్చిగా ఉంటుందని, మనం వస్తువులను అసెంబ్లింగ్ చేస్తున్నాం, దిగుమతి చేసుకుంటున్నామని, వాటిని తయారుచేయడం లేదని, అందుకే వాటిని తయారు చేస్తున్న చైనా లాభపడుతోందని ఆయన వివరించారు.
నినాదాల్లో ఘటికులు
నినాదాలు చేయడంలో మోదీ ఘటికులని, పరిష్కారాల్లో కాదని రాహుల్ విమర్శించారు. 2014 నుంచి తయారీ రంగం మన ఆర్థిక వ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని, ఎలాంటి ఐడియాలు లేక మోదీ చేతులెత్తేసారని అన్నారు. ఎంతో హైప్ పెంచిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని సైతం నెమ్మదిగా వెనక్కి తీసుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.
తయారీ రంగంలో సంస్కరణలు
ఇండియాలో తయారీ రంగంలో సంస్కరణలు తీసుకోవాల్సి తరుణమిదేనని రాహుల్ అన్నారు. ఇండియాలో తయారు చేయడం, ఇండియాలో అసెంబ్లింగ్ చేయడం వేర్వేరని, నిజమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టకపోతే వెనకబడి పోతామని అన్నారు. మొబైల్, ల్యాప్టాప్ తయారీ రంగంలో చైనా డామినేషన్ ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. నిజాయతీతో కూడిన సంస్కరణలు, దేశంలోని లక్షలాది మంది చిన్న, మధ్యతరహా ఉత్పతిదారుల సాధికారత కోసం ఆర్థిక మద్దతు ఇవ్వాలని అన్నారు. స్థిరమైన ఆర్థికాభివృద్ధికి ఈ చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఇదేనని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆ ముగ్గురినీ వెంటనే ఉద్యోగంలోంచి తీసేయండి.. ఎయిరిండియాకు డీజీసీఏ ఆదేశం..
సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం...తేల్చిచెప్పిన అమిత్షా
For National News And Telugu News