Gold Articles: వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించిన గుళ్లు.. ఎందుకంటే..
ABN , Publish Date - Apr 18 , 2025 | 07:26 AM
Earning Money From Gold Articles: 21 గుళ్లలో దాదాపు 1000 కేజీల బంగారం నిరుపయోగంగా పడి ఉంది. ఆ బంగారం మొత్తం భక్తుల నుంచి కానుకలుగా వచ్చినదే. అలాంటి ఆ బంగారాన్ని డబ్బులు సంపాదించే మార్గంగా మలుచుకోవాలని ఆ 21 గుళ్లు భావించాయి.

హిందూ భక్తులు దేవుడ్ని ఏదైనా కోరిక కోరుకోవటం.. ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవటం పరిపాటి. కోరిక తీరగానే.. తాహతకు తగ్గట్టు కానుకలు ఇస్తూ ఉంటారు. వాటిలో బంగారు ఆభరణాలు కూడా ఉంటూ ఉంటాయి. భక్తులు కానుకగా ఇచ్చిన బంగారు అభరణాలను కొన్ని గుళ్లు బ్యాంకుల్లో పెట్టేస్తున్నాయి. మరి కొన్ని గుళ్లలో మాత్రం అవి ఎలాంటి ఉపయోగం లేకుండా పడి ఉంటున్నాయి. అలా నిరుపయోగంగా పడి ఉన్న బంగారంతో అద్భుతం చేయడానికి తమిళనాడులోని కొన్ని గుళ్లు పూనుకున్నాయి. ఆ బంగారం మొత్తాన్ని కరిగించేసేశాయి. కరిగించిన బంగారాన్ని బ్యాంకు స్కీములో పెట్టేశాయి. తమిళనాడులోని 21 గుళ్లలో దాదాపు 1000 కేజీల బంగారం నిరుపయోగంగా పడి ఉంది.
ఆ బంగారం మొత్తం భక్తుల నుంచి కానుకలుగా వచ్చినదే. అలాంటి ఆ బంగారాన్ని డబ్బులు సంపాదించే మార్గంగా మలుచుకోవాలని ఆ 21 గుళ్లు భావించాయి. ఈ నేపథ్యంలోనే 10,74,123.488 గ్రాముల బంగారాన్ని సేకరించాయి. ఆ మొత్తాన్ని ముంబై తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వ మింట్లో కరిగించాయి. కరిగించిన బంగారం ఆభరణాలను 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం బార్లుగా మార్చాయి. వాటిని భారతీయ స్టేట్ బ్యాంకులో గోల్డ్ ఇన్వెస్టిమెంట్ స్కీమ్ కింద డిపాజిట్ చేశాయి. తద్వారా వచ్చే ఆదాయాన్ని గుళ్ల అభివృద్దికి ఉపయోగించనున్నారు.
స్టేట్ బ్యాంకు గోల్డ్ స్కీము కింద 1000 కేజీల బంగారానికి గానూ.. ప్రతీ ఏటా 17.81 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఈ విషయాలను హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్ మినిష్టర్ పీకే శేఖర్ బాబు అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. మార్చి 31వ తేదీ వరకు ఆ బంగారాన్ని సేకరించినట్లు తెలిపారు. 1000 కేజీల బంగారంలో సమయపురం అరుల్మిగు మారియమ్మన్ గుడి నుంచి ఎక్కువ బంగారం వచ్చిందని అన్నారు. ఆ ఒక్క గుడినుంచే 424.26 కేజీల బంగారం సేకరించినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..
Krishna Water Share Demand: 45 టీఎంసీలను తెలంగాణకే కేటాయించాలి