Supreme Court: మీరు ఆమోదించకుంటే చెల్లని బిల్లులైపోతాయా?
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:23 AM
మరి మీరు చెప్పినట్టు అవి చెల్లని బిల్లులే అయితే వాటిని రాష్ట్రపతికి ఎలా పంపిస్తున్నారు? మీ వాదనల్ని అంగీకరించలేకపోతున్నాం’’ అంటూ సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ను నిలదీసింది.
తమిళనాడు గవర్నర్ను నిలదీసిన సుప్రీం
చెన్నై, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘‘శాసనసభ రూపొందించిన బిల్లుల్ని మీరు ఆమోదించకపోతే అవి చెల్లనివైపోతాయని ఎలా చెబుతారు?.. మరి మీరు చెప్పినట్టు అవి చెల్లని బిల్లులే అయితే వాటిని రాష్ట్రపతికి ఎలా పంపిస్తున్నారు? మీ వాదనల్ని అంగీకరించలేకపోతున్నాం’’ అంటూ సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ను నిలదీసింది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న పది కీలకమైన బిల్లుల్ని ఆమోదించేలా గవర్నర్ను ఆదేశించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల భర్తీ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోకుండా నియంత్రించాలని అభ్యర్థిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 4వ తేదీ నుంచి రోజువారీ విచారణ జరుపుతోంది. సోమవారం విచారణ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది.
తాను ఆమోదించని పక్షంలో అసెంబ్లీ రూపొందించిన బిల్లులు చెల్లనివిగా మారిపోతాయన్న గవర్నర్ వాదనను తప్పుబట్టింది. శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్కు ఉందా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. ఏ బిల్లునైనా అంగీకరించకూడదని అనుకుంటే వెంటనే గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చని రాజ్యాంగ ధర్మాసనం చెబుతోందని స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదం వ్యవహారంలోనూ, వీసీల నియామక వ్యవహారంలోనూ గవర్నర్ పారదర్శకంగా వ్యవహరించలేదనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రకారం శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం మినహా మరో మార్గం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు గవర్నర్ తరఫు నుంచి సమాధానం లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..