Supreme Court: సహజీవనానికి సమ్మతే కీలకం
ABN , Publish Date - May 10 , 2025 | 05:23 AM
ఆర్థిక స్వాతంత్య్రం పొందిన మహిళలు సహజీవన బంధంలోకి ప్రవేశించడం ఈనాడు చాలా మామూలు వ్యవహారంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

కోర్టులు దానినే పరిగణించాలి
వివాహ హామీతో శారీరకంగా కలిశాననే వాదన చెల్లదు
రేప్ కేసును కొట్టేస్తూ సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 9 : ఆర్థిక స్వాతంత్య్రం పొందిన మహిళలు సహజీవన బంధంలోకి ప్రవేశించడం ఈనాడు చాలా మామూలు వ్యవహారంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వయోజనులైన యువతి, యువకుడు సహజీవన బంధంలోకి ఇష్టపూర్వకంగా వస్తున్నారంటేనే దానివల్ల రాగల పరిణామాల పట్ల పూర్తి అవగాహన వారికి ఉన్నదనే భావించాల్సి ఉంటుందని పేర్కొంది. వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వడం వల్లే తాను ఆ బంధానికి అంగీకరించానని చేసే వాదన చెల్లదని అభిప్రాయపడింది. ఓ వ్యక్తిపై అతని సహజీవన భాగస్వామి చేసిన అత్యాచార అభియోగాలను కొట్టివస్తూ ఇచ్చిన తీర్పులో భాగంగా న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో చిన్న ఫిర్యాదు కూడా లేకుండా రెండేళ్లకు పైగా శారీరక సంబంధంలో ఇరువురూ కొనసాగారని బెంచ్ గుర్తించింది. అంతకాలం ఆ సంబంధంలో కొనసాగారంటేనే సంపూర్ణ అవగాహన, అంగీకారం, ఇష్టంతోనే ఆ పని చేశారనే వాదనకు బలం చేకూరుతుందని తెలిపింది. అందువల్ల ఇలాంటి కేసుల పట్ల కోర్టు మరీ పండిత చర్చలకు దిగకుండా ఉండటం మంచిదని సూచించింది. వివాహం చేసుకోవాలనే తలంపుతోనే సహజీవనం చేశారా లేదా అనేదీ అప్రస్తుతమని తెలిపింది. ఎంతకాలంగా కలిసి ఉంటున్నారు.. దానిపట్ల ఇరువురికీ అవగాహన, అంగీకారం ఉన్నాయా లేదా ...భాగస్వాముల ప్రవర్తన ఎలాంటిది అనే అంశాలను మాత్రం పరిగణించి కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలునని బెంచ్ అభిప్రాయపడింది.