Tamil Nadu: ఏ రాష్ట్రాన్నీ బలవంతంగా ఒప్పించలేం
ABN , Publish Date - May 10 , 2025 | 05:27 AM
త్రిభాషా సూత్రంతో కూడిన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)-2020ను అమలు చేసేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది.

జాతీయ విద్యా విధానంపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, మే 9: త్రిభాషా సూత్రంతో కూడిన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)-2020ను అమలు చేసేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఎన్ఈపీ-2020 అమలు చేయాలా వద్దా అనేది రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. ఆర్టికల్ 32 ప్రకారం ప్రజల హక్కులు పరిరక్షించేలా చూడటానికే ఆదేశాలు ఇవ్వగలం. ఎన్ఈపీ-2020 లాంటి పాలసీలను అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేం.
ఎన్ఈపీ విషయంలో ఏ రాష్ట్రమైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రమే జోక్యం చేసుకోగలం. అందువల్ల ఈ పిటిషన్ను విచారించలేం’’ అని ఽధర్మాసనం వెల్లడించింది. అయితే ప్రధాన సమస్య విషయంలో తగిన ప్రొసీడింగ్స్లో విచారణ చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది. కాగా, పిల్ విచారణకు ముందు పిటిషనర్ జీఎస్ మణిని కోర్టు ప్రశ్నించింది. ఎన్ఈపీ అమలు చేయాలని ఎందుకు కోరుకుంటున్నారని అడిగింది. దీనిపై పిటిషనర్ స్పందిస్తూ.. తాను తమిళనాడుకు చెందిన వ్యక్తిని అని, ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నానని చెప్పారు. ఎన్ఈపీ అమలు కాకపోవడం వల్ల తమిళనాడులో తాను సులువుగా హిందీ నేర్చుకోలేనని తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘ఇప్పుడు ఢిల్లీలో నేర్చుకోండి’ అంటూ సూచించింది.