Shubanshu Shukla: శుభాకాంక్షలు శుక్లా..
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:12 AM
మరో భారతీయుడు అంతరిక్షంలో విహరించేందుకు సర్వం సిద్ధమైంది! అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ‘యాక్సియం స్పేస్’ చేపట్టిన యాక్సియం 4 (యాక్స్-4) మిషన్లో భాగంగా.. భారత వాయుసేన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎ్సఎస్)కి వెళ్లనున్నారు.
‘మిషన్ ఆకాశ గంగ’లో భాగంగా రేపే ఐఎ్సఎ్సకి బయల్దేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాన్షు శుక్లా
యాక్సియం-4 మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి!
ఎల్లుండి రాత్రి పదింటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి
రెండు వారాలపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాల నిర్వహణ
న్యూఢిల్లీ, జూన్ 8: రోదసి నుంచి భారతదేశం ఎలా కనపడుతోందని అడిగితే.. ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ జవాబిచ్చిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ వారసుడిగా ఆయన రోదసిలోకి వెళ్లిన నాలుగు దశాబ్దాల తర్వాత.. మరో భారతీయుడు అంతరిక్షంలో విహరించేందుకు సర్వం సిద్ధమైంది! అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ‘యాక్సియం స్పేస్’ చేపట్టిన యాక్సియం 4 (యాక్స్-4) మిషన్లో భాగంగా.. భారత వాయుసేన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎ్సఎస్)కి వెళ్లనున్నారు. ఐఎ్సఎ్సకు వెళ్లే తొలి భారతీయ వ్యోమగామి ఆయనే. అమెరికన్ వ్యోమగామి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్ కమాండర్గా ఉండే ఈ మిషన్లో.. శుక్లా పైలట్గా వ్యవహరిస్తారు. వీరితోపాటు.. పోలండ్కు చెందిన స్లావోష్ ఊజ్నైన్స్కీ, హంగరీకి చెందిన టిబోర్ కాఫూ వెళ్లనున్నారు. ఆయా దేశాల నుంచి రోదసిలోకి వెళ్లనున్న తొలి వ్యోమగాములు వారే కావడం విశేషం. ‘మిషన్ ఆకాశ గంగ’ అనే పేరుతో భారతీయులంతా పిలుచుకుంటున్న ఈ మిషన్.. మనకాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.52 గంటలకు ప్రారంభం కానుంది.

ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈలన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ సీ-213 స్పేస్క్రా్ఫ్టలో ఆ నలుగురూ ఐఎ్సఎ్సకు పయనం కానున్నారు. ఫాల్కన్9 రాకెట్ ద్వారా ఆ వ్యోమనౌకను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెడతారు. అది భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాదాపు 10 గంటల సమయానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం (డాక్) అవుతుందని అంచనా. ఈ మిషన్ సమయం 14 రోజులు. అంటే.. రెండువారాలపాటు వారు ఐఎ్సఎ్సలో ఉండి దాదాపు 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపట్టనున్నారు. వాటిలో ఏడు మన భారతదేశ పరిశోధకులు ఎంపిక చేసినవి. అవి.. మైక్రో ఆల్గే (సూక్ష్మ శైవలాల)పై భారరహిత స్థితి ప్రభావం, స్పేస్ రేడియేషన్ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయోగం (సూక్ష్మ శైవలాలను అంతరిక్ష ప్రయోగాల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అలాగే.. మైక్రో ఆల్గేను పోషకాలు అధికంగా గల ఆహారంగా పరిగణిస్తారు). ఈ సూక్ష్మ శైవలాలు భూమ్మీద ఉన్నప్పటితో పోలిస్తే.. రోదసిలో ఉన్నప్పుడు వాటి ఆర్ఎన్ఏలో, ప్రొటీన్లలో, జీవరసాయన చర్యల్లో జరిగే మార్పులపై అధ్యయనం చేస్తారు. అలాగే.. సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో కండరాల పునరుద్ధరణ, రోదసిలో పెసర, మెంతి సాగు తదితర అంశాలపై దృష్టి సారిస్తారు. శుక్లా ఈ ప్రయోగాలన్నింటినీ కేంద్రం ఆధ్వర్యంలో మన భారతీయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తయారు చేసిన ఉపకరణాలతోనే చేయనున్నారు.
శుక్లాకు 130 ఏళ్లేమో...
శుబాన్షు శుక్లా 1985లో యూపీలోని లఖ్నవూలో జన్మించారు. 2006 జూన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఫైటర్ వింగ్లో చేరారు. ఎస్యు-30 ఎంకేఐ, మిగ్ 21, మిగ్ 29, జాగ్వార్, హాక్, డోర్నియర్, ఏఎన్-32 సహా పలు రకాల విమానాలను 2000 గంటలపాటు నడిపి అపార అనుభవాన్ని గడించారు. 2024 నాటికి గ్రూప్కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. తన కెరీర్లో ఎన్నో అవార్డులు, పతకాలు సాధించిన శుక్లాకు 2019లో ఇస్రో నుంచి పిలుపు వచ్చింది. దరిమిలా ఆయన మాస్కో(రష్యా)లోని యూరీ గగారిన్ కాస్మొనాట్ ట్రైనింగ్ సెంటర్లో వ్యోమగామి శిక్షణ పొందారు. ఈ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం వల్ల.. స్పేస్ఫ్లైట్ ఆపరేషన్స్, లాంచ్ ప్రోటోకాల్స్ వంటివాటిలో అనుభవం సంపాదించే అవకాశం ఆయనకు లభిస్తుంది. అంతేకాదు.. శిక్షణలో భాగమైన కృత్రిమ భారరహిత స్థితి కాకుండా.. రోదసిలో ఉండే నిజమైన భారరహిత స్థితిని అనుభవిస్తారు. ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మిషన్లో ఈ అనుభవాలు ఆయనకు ఎంతగానో ఉపకరిస్తాయి. కాగా.. ఈ మిషన్లో శుక్లాతోపాటు పాల్గొనబోయే మిగతా వ్యోమగాములు ఆయన్ను ఎంతగానో ప్రశంసించారు. శుక్లాను చాలా తెలివైన వ్యక్తిగా ఈ మిషన్ కమాండర్ పెగ్గీ వాట్సన్ కొనియాడగా.. శుక్లా ఏ పైనా చాలా వేగంగా చేస్తారని, అంత వేగంగా ఎలా చేస్తారో తనకు తెలియదని స్లావోష్ ప్రశంసించారు. ఇక హంగరీ వ్యోమగామి టిబోర్ కాపు అయితే.. ‘‘శుక్లాకున్న పరిజ్ఞానం, తెలివి చూస్తుంటే ఆయన వయస్సు 130 ఏళ్లేమో అనిపిస్తుంది’’ అని కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News