Share News

Maoists: కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

ABN , Publish Date - May 15 , 2025 | 03:36 AM

చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులపాటు కొనసాగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దేశాన్ని మార్చి 2026 నాటికి నక్సల్స్‌ రహితంగా చేసేందుకు సంకల్పం వ్యక్తం చేశారు.

Maoists: కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

ఇప్పటి వరకు 28 మందిని గుర్తించాం

వీరందరిపై రూ.1.72 కోట్ల రివార్డు

మావోయిస్టు అగ్రనేతలూ హతమై ఉంటారు!

సెర్చ్‌ ఆపరేషన్‌లో మృతదేహాలు దొరుకుతున్నాయి

ఐఈడీలు, అధునాతన తుపాకులు స్వాధీనం

ఆపరేషన్‌ కగార్‌ కొనసాగుతుంది

మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో దారి లేదు

సీఆర్‌పీఎఫ్‌ డీజీ జి.పి.సింగ్‌, ఛత్తీ్‌సగఢ్‌ డీజీపీ అరుణ్‌దేవ్‌

మార్చి 31, 2026 కల్లా నక్సల్స్‌ రహిత భారత్‌: షా

చర్ల, మే 14(ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు సమస్య అంతానికి ఇది ఆరంభమన్నారు. బీజాపూర్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఆర్‌పీఎఫ్‌ డీజీ గ్యానేంద్ర ప్రతాప్‌(జీపీ) సింగ్‌, ఛత్తీ్‌సగఢ్‌ డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతమ్‌.. కర్రెగుట్టల ఆపరేషన్‌ వివరాలను వెల్లడించారు. మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ, ఛత్తీ్‌సగఢ్‌ నక్సల్స్‌ కర్రెగుట్టలపై ఉన్నట్లు సమాచారం రావడంతో ఏప్రిల్‌ 21న ఆపరేషన్‌ ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో బలగాలు కూంబింగ్‌ చేశాయని, ఆపరేషన్‌ సాగిన 21 రోజుల్లో 21 ఎన్‌కౌంటర్లు జరిగాయని చెప్పారు. అడవుల్లో 450 బీర్‌ బాంబులు, ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోయారని, ఇప్పటివరకు 28 మందిని గుర్తించామని, ఏడుగురి మృతదేహాలను వారి కుటుంబాల కు అప్పగించామని వివరించారు. వీరందరిపై రూ.1.72 కోట్ల రివార్డు ఉందన్నారు. బలగాల దాడిలో చాలా మంది మావోయిస్టులు మృతి చెందారని, సెర్చ్‌ ఆపరేషన్‌లో మృతదేహాలు దొరుకుతున్నాయని తెలిపారు.


మృతుల్లో చాలా మంది కీలక నేతలు కూడా ఉంటారని పేర్కొన్నారు. ప్రధా న నేతలు చనిపోవడం లేదా గాయపడడం జరిగిందని తెలిపారు. గుట్టల్లో 214 మావోయిస్టు డంపులు గుర్తించామని, భారీగా ఐఈడీలు, డిటోనేటర్లు, బీజీఎల్‌ లాంచర్లు, వైర్లు, విప్లవ సాహిత్య పుస్తకాలు, జనరేటర్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నాలుగు ఆయుధ తయారీ ఫ్యాక్టరీలను ధ్వంసం చేశామన్నారు. చనిపోయిన మావోయిస్టుల నుంచి అధునాతన మెషిన్‌గన్స్‌, ఏకే 47, ఇన్సాస్‌ తుపాకు లు లభించాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో తాము అనుకున్న దానికంటే ఎక్కువే సాధించామన్నారు. మావోయిస్టుల సమస్యను అంతం చేసే క్రమంలో ఇది ఆరంభమేనని.. దేశంలో మార్చి 2026కల్లా నక్సల్స్‌ను పూర్తిగా ఏరిపారేస్తామని సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో 18 మంది జవాన్లు గాయపడ్డారన్నారు. మావోయిస్టుల కు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేదని చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు.


వచ్చే మార్చి కల్లా నక్సల్స్‌ రహిత దేశం: షా

భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో 31 మంది కరుడుగట్టిన నక్సలైట్లను హతమార్చడం ద్వారా దేశాన్ని నక్సల్స్‌ రహితం గా మార్చే లక్ష్యంలో కీలక ముందడుగు వేశాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. దేశంలో నక్సలిజాన్ని తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. మార్చి 31, 2026 కల్లా దేశాన్ని నక్సల్స్‌ రహితంగా చేస్తామని మరోసారి భారతీయులకు హామీ ఇస్తున్నట్లు బుధవారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:36 AM