Share News

PM Modi: సత్యసాయి సంజీవనీ హాస్పిటల్‌‌ను సందర్శించిన ప్రధాని మోదీ.. చిన్నారులతో ముచ్చట్లు

ABN , Publish Date - Nov 01 , 2025 | 05:08 PM

రాయ్‌పూర్ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో పీఎం సమావేశమయ్యారు.

PM Modi: సత్యసాయి సంజీవనీ హాస్పిటల్‌‌ను సందర్శించిన ప్రధాని మోదీ.. చిన్నారులతో ముచ్చట్లు
PM Modi

రాయ్‌పూర్, నవంబర్ 1: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. బిల్ కౌంటర్‌ ఊసేలేని ఆస్పత్రులుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులలో ఒకటైన ఆసుపత్రి ఇది. ఈ సందర్భంగా చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో పీఎం సమావేశమయ్యారు. తొలుత ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానిని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి ఆహ్వానం పలికారు. అనంతరం సత్యసాయి ఆస్పత్రుల ఛైర్మన్ శ్రీనివాసన్ ప్రధానికి సత్యసాయి చిత్ర పటాన్ని అందజేశారు. ముందుగా ప్రధాని భగవాన్ సత్యసాయి బాబా విగ్రహానికి మోదీ పూజలు నిర్వహించారు. అనంతరం చికిత్స పొందిన చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్, సత్య సాయి సంజీవనీ హాస్పటల్స్ ట్రస్టుల్లో ఒకరైన సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు.

CompressJPEG.Online_img(1280x720) (7).jpg


వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌లో భాగంగా సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులు పనిచేస్తాయి. ఈ మిషన్ 100కు పైగా దేశాల్లో వైద్యం, విద్య, పోషకాహార రంగాలలో సేవలందిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత పిడియాట్రిక్ కార్డియక్ చైన్ ఆఫ్ హాస్పటల్స్‌ గా సంజీవనీ ఆస్పత్రులు గుర్తింపు పొందాయి. అలాగే 25 రాష్ట్రాలలో 4 కేంద్ర పాలిత ప్రాంతాలలో రోజూ కోటి మంది ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు పోషాకాహారాన్ని అందిస్తోంది. అంతే కాదు దేశంలోనే మొట్టమొదటి ఉచిత ప్రైవేటు వైద్య కళాశాలను కూడా నిర్వహిస్తోంది. 2023లో ఈ మెడికల్ కాలేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

CompressJPEG.Online_img(1280x720) (6).jpg


దేశ వ్యాప్తంగా 12 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు శ్రీలంక, ఫిజీ, నైజీరియా, అమెరికా దేశాల్లో మరో 4 ఆస్పత్రులు ఉన్నాయి. ఆంధ్ర-కర్నాటక సరిహద్దుల్లోని బెంగళూరు ఎయిర్ పోర్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో ఈ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇక్కడ గడిచిన మూడున్నరేళ్లుగా 340 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిత్యం వేలాది మంది రోగులకు ఉచితంగా సేవలందిస్తోంది. మరి కొద్ది రోజుల్లో 600 పడకల ఆస్పత్రిని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ప్రపంచంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న అతి పెద్ద ఆస్పత్రి ఇదే. ఇక్కడ కూడా బిల్లింగ్ కౌంటర్ అన్న ఊసే ఉండదు. ఈ ఆస్పత్రులలో ఇప్పటి వరకు 37 వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు అందించారు. 15, 900 మంది గర్భిణులకు ఉచితంగా డెలీవరీలు చేశారు. 30 లక్షల మందికిపైగా ఔట్ పేషంట్లకు చికిత్సనందించారు. లక్ష40 వేల మందికి పైగా ఇన్ పేషంట్లకు చికిత్స చేశారు.

CompressJPEG.Online_img(1280x720) (5).jpg


ఇక ఎడ్యుకేషన్ కు సంబంధించి దేశంలోనే ఉచిత వైద్య కళాశాలతో పాటు సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ పేరిట ఓ విశ్వ విద్యాలయం కూడా ఉంది. వాటితోపాటు కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 6వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కట్టుబట్టలతో విద్యార్థులు చేరితే చాలు... వాళ్లు తమకు నచ్చిన రంగాలలో డిగ్రీలు తీసుకొని బయటకు రావచ్చు. దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడమే లక్ష్యంగా అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా సాయి ష్యూర్ పోషకాహారాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల చిన్నారులకు అందిస్తోంది. 2012లో సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో ప్రారంభమైన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ కేవలం 13 ఏళ్లలోనే 100 దేశాల్లో విస్తరించి సత్యాసాయి బాబా ఆశయ సాధనకు కృషి చేస్తోంది.

CompressJPEG.Online_img(1280x720) (4).jpg


ఇవి కూడా చదవండి:

PM Modi: ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ

Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న వాయుకాలుష్యం

Updated Date - Nov 01 , 2025 | 07:07 PM