India Pakistan ceasefire: ట్రంప్ ప్రమేయమేమీ లేదు
ABN , Publish Date - May 20 , 2025 | 05:07 AM
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి పాత్ర లేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షిక నిర్ణయం అని స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ప్రకటనపై ఆయన మా అనుమతి తీసుకోలేదు
పార్లమెంటరీ కమిటీతో విక్రమ్ మిస్రీ!
న్యూఢిల్లీ, మే 19: పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు విరామంగా భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వెనక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఏమీ లేదని పార్లమెంటరీ కమిటీతో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పీటీఐతోపాటు.. పలు వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీ సోమవారం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఎంపీలు అభిషేక్ బెనర్జీ(తృణమూల్), రాజీవ్ శుక్లా(కాంగ్రెస్), దీపేందర్ హుడా(కాంగ్రెస్), అసదుద్దీన్ ఒవైసీ(మజ్లిస్), అపరాజిత సారంగి(బీజేపీ), అరుణ్ గోవిల్(బీజేపీ) తదితరులు పాల్గొన్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతలపై కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు విక్రమ్ మిస్రీ సమాధానమిచ్చారు. ‘‘భారత్-పాక్ మధ్య అణు యుద్ధాన్ని నిలువరించానని, కశ్మీర్ సమస్యను పరిష్కరించానని ట్రంప్ కనీసం ఏడు సార్లు ప్రకటించారు. అయినా.. భారత్ ఎందుకు మౌనంగా ఉంది?’’ అని పలువురు సభ్యులు మిస్రీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. భారత్-పాక్ ఘర్షణను నిలువరించడంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారని జాతీయ మీడియా పేర్కొంది. ‘‘కాల్పుల విరమణ పూర్తిగా ద్వైపాక్షిక నిర్ణయం.
ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయానికి మా నుంచి అనుమతి తీసుకోలేదు. ఆయన ఈ వ్యవహారంలో కేంద్రంగా నిలవాలని భావించి ఉంటారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్థాన్ డీజీఎంవో నుంచి ప్రతిపాదన రాగా.. మన డీజీఎంవో కేంద్రానికి తెలిపారు. అలా ద్వైపాక్షికంగానే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది’’ అని చెప్పినట్లు వివరించింది. ‘‘పాకిస్థాన్ అణుయుద్ధం బెదిరింపులతోనే కాల్పుల విరమణ జరిగిందా?’’ అని సభ్యులు అడిగిన ప్రశ్నకు.. పాకిస్థాన్ నుంచి అణు సంకేతాలేమీ రాలేదని మిస్రీ స్పష్టంచేశారు. భారత్కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనపై ప్రశ్నను ‘జాతీయ భద్రత’ ఆందోళనల పేరుతో దాటవేశారని జాతీయ మీడియా పేర్కొంది. ‘‘పాకిస్థాన్కు చెప్పే దాడులు చేశామని జైశంకర్ అన్నారు కదా?’’ అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. కేంద్ర మంత్రి జైశంకర్ మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విక్రమ్ మిస్రీ పార్లమెంట్ కమిటీ సభ్యులను కోరారు. పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేసినట్లు పాకిస్థాన్కు చెప్పామని మంత్రి అన్నట్లు గుర్తుచేశారు. పాకిస్థాన్కు తుర్కియే, అజర్బైజాన్ మద్దతుపై సభ్యులు ప్రశ్నలడగ్గా.. ‘‘ముగ్గురు సోదరులుగా పాకిస్థాన్-తుర్కియే-అజర్బైజాన్కు పేరుంది’’ అని విక్రమ్ మిస్రీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి