Pakistans Economy: పాక్ ఆర్థికం అతలాకుతలం..
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:31 AM
పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. మే 2 నుంచి పాకిస్థాన్పై భారత్ విధించిన నిషేధంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా భారతీయ పోర్టుల్లో పాకిస్థానీ నౌకలను నిషేధించడంతో...
నౌకలపై భారత్ నిషేధం విధించడంతో తీవ్ర నష్టం
ఎగుమతులు, దిగుమతుల్లో 50 రోజుల జాప్యం
వెల్లడించిన ‘డాన్’ కథనం
(సెంట్రల్ డెస్క్): పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. మే 2 నుంచి పాకిస్థాన్పై భారత్ విధించిన నిషేధంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా భారతీయ పోర్టుల్లో పాకిస్థానీ నౌకలను నిషేధించడంతో ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాకిస్థాన్ పత్రిక ‘డాన్’ ఈ అంశంపై ఓ కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్ నౌకలపై నిషేధం విధించడంతో.. భారీ నౌకలు కరాచీ పోర్టులోనే లంగర్ వేసుకుని, ఎదురు చూస్తున్నాయి. భారత పోర్టుల్లో అనుమతి లేకపోవడంతో.. సాధారణంగా జరగాల్సిన ఎగుమతులు, దిగుమతుల్లో 30 నుంచి 50 రోజుల మేర ఆలస్యం నమోదవుతోంది. భారత్ విధించిన నిషేధంతో లాజిస్టిక్స్ ధరలు గణనీయంగా పెరిగాయని, బీమా ఖర్చులు కూడా పెరిగినట్లు కరాచీకి చెందిన వస్త్రాల ఎగుమతిదారుడు ఆమిర్ అజీజ్ వాపోయారు. ఫలితంగా షిప్పింగ్ ధరలు భారీగా పెరిగినట్లు వివరించారు. భారత్ నిషేధం విధించిన తొలినాళ్లలో పాకిస్థాన్ దొడ్డిదారిలో సరుకు రవాణాకు సిద్ధమైంది. అయితే.. భారత్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) ఈ తరహా దిగుమతులు, ఎగుమతులపై కొరడా ఝుళిపిస్తోంది. యూఏఈ, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాల నుంచి పాక్ పంపే సరుకులను కట్టడి చేసేందుకు ‘ఆపరేషన్ డీప్ మానిఫె్స్ట’ను ప్రారంభించింది. ఫలితంగా 39 కంటైనర్లలోని రూ.9 కోట్ల విలువ చేసే 1,100 మెట్రిక్ టన్నుల సరుకు సీజ్ అయ్యింది. పాక్ ఈ సరుకును యూఏఈలో తయారైనట్లు తప్పుడు రికార్డులను సృష్టించి, భారత్కు తరలించింది.
దారుణ పరిస్థితులు
కరాచీ, కాసీం పోర్టులు పాక్ ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకం. వీటికి దన్నుగా గ్వాదర్ పోర్టు ఉంది. ఈ మూడు పోర్టులు ఆ దేశ జీడీపీకి 0.5ు వాటాను అందజేస్తున్నాయి. ఈ పోర్టుల ద్వారా పాక్ ప్రభుత్వానికి ఏటా రూ.15 వేల కోట్ల మేర ఆదాయం లభిస్తుందని అంచనా. భారత్ ఆంక్షల తర్వాత.. పోర్టుల ద్వారా ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోంది. ఇక భారత్ నుంచి 2018లో ఇరు దేశాల మధ్య 2.41 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం జరగ్గా.. 2024లో అది 1.2 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. పహల్గాం దాడితో ఈ సంబంధాలు మరింతగా క్షీణించాయి.
వారంలోనే ధరాఘాతం
గడిచిన వారం రోజుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం పలు ఉత్పత్తుల ధరలను పెంచగా.. నిత్యావసరాలకు రెక్కలు వచ్చే పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వం 50ు పెంచింది. గతంలో సబ్సిడీ సిలిండర్ ధర భారత కరెన్సీలో రూ.120గా ఉండగా.. ప్రస్తుతం రూ.180కి చేరుకుంది. నాన్-సబ్సిడీ సిలిండర్ల ధర రూ.303 నుంచి రూ.455కు పెరిగింది గత వారంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.78.56 నుంచి రూ.80.02కు.. డీజిల్ ధర రూ.79.84 నుంచి రూ.82.26కు పెరిగింది. జూలై 1 నుంచి ఈ ధరలు మరింత పెరగనున్నాయి.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News