Operation Sindoor: చెప్పినదానికన్నా ఎక్కువే
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:23 AM
ఆపరేషన్ సిందూర్లో భారత్ చేసిన దాడులు పాకిస్థాన్లో అనేక స్థావరాలను ధ్వంసం చేశాయని పాక్ ప్రకటించింది. కానీ రక్షణ నిపుణులు పాక్ తెలిపిన వివరాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ, కొన్ని ప్రాంతాలపై దాడి వివరాలు అసంపూర్ణమని అంటున్నారు.
11 పాకిస్థాన్ ఎయిర్బే్సలను ధ్వంసం చేశామన్న భారత రక్షణ శాఖ
ఆ జాబితాలో లేని మరో 8 చోట్ల భారత్ దాడి చేసిందన్న పాకిస్థాన్
సరిహద్దుల నుంచి 700 కిలోమీటర్ల లోపల కూడా టార్గెట్ చేసినట్టు ఆరోపణ
న్యూఢిల్లీ, జూన్ 3: ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ చేసిన దాడులు పాకిస్థాన్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయా? మన ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినదాని కంటే కూడా ఎక్కువ ప్రాంతాలను వాయుసేన ధ్వంసం చేసిందా? పాక్ తనకు భారీ నష్టం జరిగిందని స్వయంగా ప్రకటించడం ఏమిటి? నిజంగా భారీ నష్టం జరిగిందా? దీని వెనుక భారత్ను బద్నాం చేసే కుట్ర ఉందా?.. భారత ఆపరేషన్కు ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్ బన్యన్ ఉన్ మర్సూ్స’కు సంబంధించి పాక్ విడుదల చేసిన ‘సవివర సమాచార పత్రం (డోజియర్)’ ఇవే ప్రశ్నలను లేవనెత్తుతోంది. భారత్ మరో ఎనిమిది ప్రాంతాల్లోనూ దాడులు చేసినట్టు పాక్ అందులో పేర్కొంది.
డోజియర్లో మ్యాప్లతో సహా..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. మే 7న అర్ధరాత్రి పాక్, పీఓకేలలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాక్ పెద్ద సంఖ్యలో డ్రోన్లు, స్వల్ప శ్రేణి క్షిపణులతో భారత్లోని పౌర ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది. వీటిని అడ్డుకుని, పాక్ను నిలువరించేందుకు మన వాయుసేన.. 10వ తేదీన భారీ ఎత్తున దాడులకు దిగింది. పాక్లోని 11 ఎయిర్బే్సలు, వ్యూహాత్మక స్థావరాలు (నూర్ఖాన్, రఫీఖి, మురిద్, సుక్కుర్, సియాల్కోట్, మర్సుర్, చునియన్, సర్గోధా, స్కరు, భొలారి, జకోబాబాద్)ను క్షిపణి దాడులతో ధ్వంసం చేశామని ప్రకటించింది. వాటికి ఆధారాలను కూడా చూపింది. అయితే పాక్ ఇందులో మూడు ఎయిర్బే్సలు మురిద్, రఫీఖి, మర్సుర్తోపాటు బలూచిస్థాన్ ప్రాంతంలోని సముంగ్లి ఎయిర్బే్సలపై మాత్రమే భారత్ దాడి చేసినట్టు డోజియర్లో పేర్కొంది. వీటితోపాటు మరో ఎనిమిది ప్రాంతాలు.. పెషావర్, ఝాంగ్, సింధ్ రాష్ట్రంలోని హైదరాబాద్, పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రాత్, గుజ్రన్వాలా, భావల్నగర్, అట్టోక్, చోర్లలోనూ భారత్ దాడులు జరిగాయని చెబుతూ.. ఆ ప్రాంతాల మ్యాప్ను కూడా పెట్టింది. భారత్ దాడిచేసినట్టు చెప్పిన ప్రాంతాలకన్నా కూడా.. ఈ ప్రాంతాల్లో కొన్ని పాక్ భూభాగంలో మరింత లోపల ఉండటం గమనార్హం. అయితే భారత్ వాస్తవంగా దాడి చేసిన కొన్ని ఎయిర్బే్సల వివరాలు దాచిపెట్టడం, ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతాలను పేర్కొనడంపై సందేహాలు వస్తున్నాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
భారత్ను బద్నాం చేసే కుట్ర?
వాస్తవానికి భారత్ చెప్పిన దానికంటే ఎక్కువ చోట్ల దాడులు జరిగాయని పాక్ తనంతట తానుగా ఎందుకు చెబుతోందన్నది కీలకమని రక్షణ నిపుణులు అంటున్నారు. పాక్ డోజియర్లో పేర్కొన్న సముంగ్లి ఎయిర్బేస్ బలూచిస్థాన్లోని క్వెట్టా నగరానికి దగ్గరిలో భారత సరిహద్దుల నుంచి సుమారు 600 కిలోమీటర్ల లోపల ఉంటుంది. పెషావర్ సుమారు 1,000 కిలోమీటర్లు, అట్టోక్ సుమారు 700 కిలోమీటర్లు లోపల ఉంటాయి. దీనికితోడు పాక్ అదనంగా చెప్పిన ఏడు ప్రాంతాలు మిలిటరీ స్థావరాలా, పౌర ప్రాంతాలా అన్నది కూడా పేర్కొనలేదు. అంటే పాకిస్థాన్ భూభాగంలో లోపలి పౌర ప్రాంతాల్లోనూ భారత్ దాడి చేసిందంటూ.. అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టేందుకు చేపట్టిన దుష్ప్రచారం ఇదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పాక్లో సాధారణ పౌరులకు ఏమాత్రం నష్టం జరగకుండా, చాలా కచ్చితత్వంతో మిలటరీ, ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని భారత దళాలు స్పష్టంగా ప్రకటించాయని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అవి మిలటరీ స్థావరాలే అయితే.. భారత్ భీకర దాడి చేసినట్టేనని, పాక్ దిగొచ్చి కాల్పుల విరమణ కోరడానికి ఇది కారణమై ఉంటుందని భావించవచ్చని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news